రాము(1968)

రాము (04-05-1968)
(అనప్పిండి సూర్య లక్ష్మీ కామేశ్వర రావు)

1968 లో విడుదలైన 58 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 11 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 13 చిత్రాలలో, శోభన్ బాబు 7 చిత్రాలలో, హరనాధ్ 6 సినిమాలలో, ఇతరులు 8 చిత్రాలలో నటించారు. జయలలిత 5 తెలుగు చిత్రాలలో , కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు. సి ఎస్ రావు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జి వర లక్ష్మి, సావిత్రి దర్శకురాళ్ళుగా మారారు.
ఎన్ టి ఆర్ నటించిన రాము (04-05-1968) ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా రజతోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఎన్ టి ఆర్ నటించిన తల్లి ప్రేమ (09-03-1968), నిండు సంసారం (05-12-1968), నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), అక్కినేని నటించిన మంచి కుటుంబం కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన భాగ్య చక్రం , ,ఉమా చండీ గౌరీ శంకరుల కధ, కలిసొచ్చిన అదృష్టం, తిక్క శంకరయ్య, నిన్నే పెళ్ళడతా, నేనే మొనగాణ్ని, బాగ్దాద్ గజ దొంగ,
అక్కినేని నటించిన గోవుల గోపన్న, బంగారు గాజులు, బ్రహ్మచారి, సుడి గుండాలు,
కృష్ణ నటించిన అసాధ్యుడు, నిలువుదోపిడి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్ , అమాయకుడు, అత్తగారు కొత్త కోడలు, నేనంటే నేనే, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలికోసం, వింత కాపురం , లక్ష్మీ నివాసం,
కాంతారావు నటించిన అగ్గి మీద గుగ్గిలం, ఎవరు మొనగాడు, పేదరాసి పెద్దమ్మ కధ, భలే మొనగాడు, రాజ యోగం, రణ భేరి, సతీ అరుంధతి, దేవ కన్య, వీరపూజ , వీరాంజనేయ, జీవిత బంధం, కుంకుమ భరిణ, జీవిత బంధం,
శోభన్ బాబు నటించిన కలసిన మనసులు, చుట్టరికాలు, మన సంసారం, పంతాలు పట్టింపులు, భార్య, లక్ష్మీ నివాసం, కుంకుమ భరిణ,
హరనాధ్ నటించిన బంగారు సంకెళ్ళు, పెళ్ళి రోజు, నడ మంత్రపు సిరి, చల్లని నీడ, పాల మనసులు, సుఖ దుఖాలు,
ఇతరులు నటించిన పాప కోసం , భలే కోడళ్ళు, మూగ జీవులు, చిన్నారి పాపలు, లక్ష్మీ నివాసం, బాంధవ్యాలు, గ్రామ దేవతలు, బంగారు పిచిక , విడుదలయ్యాయి.
04-05-2020 కు 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాము చిత్రం విశేషాలు:-
ఏ.వి.మెయ్యప్పన్ 1938లో అల్లి అర్జున్ తో 1940 ప్రగతి స్టూడియోస్ ప్రారంభించి, కొన్ని చిత్రాలు రూపొందించారు. 1945లో మద్రాస్ లో శాంథోంలో ఎ.వి.యం.స్టూడియోస్ ప్రారంభించి పలు చిత్రాలు రూపొందించారు. వైజయంతి మాల నటిగా పరిచయమైన, ‘జీవితం’ చిత్రం వారి విజయవంతమైన చిత్రాల్లో ఒకటి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద, చిట్టి చెల్లెలు , రాము మొదలైన 100 పైగా చిత్రాలను నిర్మించిన సంస్థ. ఏ.వి.ఎం. 1968లో ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘రాము’.

1958లో అమెరికన్ చిత్రం ‘‘ది ప్రౌడ్ రెబల్’’ ఆధారంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, దర్శకుడు, ఆల్ రౌండర్ ఏ మేన్ ఆఫ్ ఆల్ వర్ట్యూస్ అయిన హిందీ నటుడు కిషోర్ కుమార్ 1964లో నిర్మించిన చిత్రం ‘‘దూర్ గగన్కి చాహున్ మైయి’’ తమ కిషోర్ ఫిలిమ్స్ బేనర్ పై కిషోర్ కుమార్ , సుప్రియాచౌదరి, అమిత్ కుమార్ కాంబినేషన్లో నిర్మించారు.
ఆ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు 1966లో ఎ.సి.త్రిలోక్చందర్ దర్శకత్వంలో, జావర్ సీతారాం స్క్రీన్ప్లే, సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్, సమకూర్చగా, జెమిని గణేషన్, పుష్పలత, కె.ఆర్.విజయ, మాస్టర్ రాము, ఎస్.ఎ.అశోకన్ కాంబినేషన్లో, యం.మురుగన్, కుమారన్, యం.శరవణన్, యం.బాలసుబ్రమణ్యం, నిర్మాతలుగా ‘రాము’ తమిళ చిత్రం రూపొందించారు. ఈ తమిళ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు నిర్మించిన తెలుగుచిత్రం రాము. ‘‘ఉమా ప్రొడక్షన్స్ సమర్పణ’.

నిర్మాణం: ఎ వి ఎం ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎం మురుగన్, ఎం కుమరన్, ఎం శరవణన్
దర్శకత్వం: ఎ సి త్రిలోక్చందర్, ఎం ఏ
స్క్రీన్ ప్లే : సీతారామన్ ఎం ఏ బి ఎల్
మాటలు : డి వి నరసరాజు, బి ఏ
పాటలు: దాశరధి, కొసరాజు, ఆరుద్ర
సంగీతం: ఆర్ గోవర్ధనం
కెమెరా: జి రాజగోపాల్
శవ్దగ్రహణం : జె ఏ మాణిక్యం
కథ, సంవిధానం జావర్ సీతారాం,
స్టంట్స్- శ్యాంసుందర్,
ఎడిటింగ్-ఆ.జి.గోపు,
నృత్యం-ఎ.కె.చోప్రా.
తారాగణం : నట రత్న పద్మశ్రీ ఎన్ టి రామారావు బి ఏ, రేలంగి, ఎస్ వి ఆర్, రాజనాల, పద్మనాభం, రమణా రెడ్డి, పద్మశ్రీ నాగయ్య, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, మాస్టర్ రాజకుమార్, జమున, గీతాంజాలి, సూర్యాకాంతం, విజయ లక్ష్మి, పుష్పలత తదితరులు.

మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) , కొడుకు రాము (మాస్టర్ రాజ్కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు.
రాజు యుద్ధరంగం నున్డి ఎంతో సంతోషంగా భార్యా బిడ్డలని కలుసుకోవాలని వస్తాడు. రైలులో తోటి జవాన్లతో ఉత్తరం రాయకుండా తనవారికి సర్ప్రైజ్ ఇస్తున్నానని ఆనందం గా చెబుతాడు. ఊరికి పడవలో వస్తూ ఇంకా కొంత దూరం ఉండగానే పడవ దూకి ఒడ్డుకు రావడం, అతని ఆత్రుత తెలుపుతుంది.

ప్రతి రోజూ తండ్రికోసం రాము ఆ ఏటి ఒడ్డున చూస్తూ ఉంటాడు మూగగా. రాజు రావడం ముందుగా వాసనతో తెలుసుకున్న వారి పెంపుడు కుక్క , రాజు రాకని రాముకు తెలపడంవంటి చిన్న చిన్న వివరాలు ఏ సి త్రిలోకచందర్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.
రాజుకు తన భార్య చనిపోయిందని, కొడుకు మూగపోయాడని తెలుస్తుంది. ఆవేదన చెందుతాడు. తల్లి సమాధివద్ద అమ్మా అని పిలు నాయనా అని ఆర్తితో చెబుతాడు కొడుకుతో. రాము ఎంత ప్రయత్నించినా గొంతు పెగలదు.
కొడుకును తీసుకుని, పెంపుడు కుక్క జాకీతో డాక్టరుకు చూపించాలని రాజు పట్నం బయలుదేరతాడు. దారిలో కట్టెలు పడి పోయినదుకు రామును కొట్టిన వ్యక్తికి (రాజనాల)బుద్ధి చెబుతాడు. కాని అతను తలమీద కొట్టినదొంగ దెబ్బకు రాజు రోడ్డుమీద పడిపోతాడు. సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున) ఆ దారిలోనే బండిలో వస్తూ, చూసి తన ఇంటికి తీసుకు వెళ్ళీ డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయిస్తుంది. మూగపోయిన రామును ఆదరిస్తుంది.రాజుపై అనురాగం పెంచుకుంటుంది.
ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.
రాముకు శస్త్ర చికిత్స చేయించడానికి రాజు మద్రాసు వెడతాడు. అక్కడ డబ్బు పోగొట్టుకుని, డాక్టర్ రాముకు మాట రాదని చెబితే నిరాశతో, సముద్రంలో పడి ప్రాణాలు తీసుకోబోతాడు రాము. దూరాన దేవాలయం నున్చి దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు అన్న గీతం విని, రాజు , రాముతో గుడిలోకి వెళతారు. అన్ని దారులూ మూసుకు పోయాకా, రాజు, రాము సీత ఉన్న వూరు చేరతారు.
గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్ చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
హిందీలో కిశోర్ కుమార్ నిర్మించిన దూర్ గగన్ కే చాన్ మే చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అయితే హాస్య నటుడైన కిశోర్ కుమార్ తొలిసారిగా ధరించిన సీరియస్ పాత్ర అది. తెలుగులో తేలిక, బరువు పాత్రలు సునాయాసంగా నటించే ఎన్ టి ఆర్ మహాద్బుతంగా నటించారు.
అలాగే మాస్టర్ రాజకుమార్ రాముగా గొప్పగా నటించాడు. సీతగ జమున, పిచ్చివాడిగా ఎస్ వి ఆర్ తమ నటనతో మెప్పించారు. రేలంగి, రాజనాల, పద్మ నాభం (తండ్రీ కొడుకులు), హాస్యం అందించారు.
ఈ చిత్రంలో లాయర్ గా అల్లురామలింగయ్య, డ్రామా ఆర్టిస్టులుగా మాణిక్యం (సూర్యాకాంతం), రత్నంగా గీతాంజలి, ఆశీర్వాదంగా రమణారెడ్డి, పాడుబడిన తోటలో చెల్లెలి మరణంతో పిచ్చివాడుగా ముద్రపడ్డ వ్యక్తిగా ఎస్.వి.రంగారావు నటించారు.
స్క్రీన్ ప్లే రైటర్గా, దర్శకునిగా ఎక్కువ భాగం తమిళ చిత్రాలకు, కొన్ని హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి, పలు అవార్డులు పొందిన విశిష్ట దర్శకులు ఏ.సి.త్రిలోక్చందర్ రాము, తమిళ, తెలుగు చిత్రాలకు రెండిటికి వీరే దర్శకత్వం వహించటం విశేషం. తెలుగుదనానికి తగ్గట్టుగా అత్యంత సహజంగా సన్నివేశాలు చిత్రీకరించి వన్నె తెచ్చారు.
నరసరాజుగారి మాటలు చిత్రానికి వన్నె తెచ్చాయి. పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందివంటి పదునైన మాటలు ఎన్నో ఈ సినిమాలో.
కథానాయకుడు రాజాగా ఎన్.టి.రామారావు మొదటి భార్య, రాములపై ప్రేమానురాగాలను తరువాత మూగవాడైన కుమారుని పట్ల బాధతో కూడిన ఆప్యాయతను, అసహాయురాలైన యువతి, తన తోటి సిపాయి సింగన్న కూతురు అయిన లక్ష్మికి అండగా నిలవటం, ఆమె తనను ఇష్టపడినా, తన భార్యపైగల ప్రేమతో ఆమెను నిరాకరించటం(చివరకు లక్ష్మి, రాముతోపాటు వారితో చోటు ఇమ్మని కోరటం) కుమారుడికి మాటలు రావని తెలిసి వేదన, డబ్బు పోగొట్టాడని కోపం, సముద్రంలో దూకనున్న కొడుకును కాపాడుకొని, దైవాన్ని వేడుకోవటం, అంతేకాక స్టంట్ మాస్టర్ రూపొందించిన పులితో పోరాటం కొరడాతో, రంగన్నతో కర్రతో ఫైట్, కాగడాలతో ఫైట్ ఎంతో సహజంగా, చురుకుగా ప్రదర్శించటం ప్రశంసనీయమైన నటన చూపారు. రాము చిత్రం లో ఎన్ టి ఆర్ నటన మహోన్నత శిఖరాలను చేరుకుంది. భార్య సమాధి వద్దకు వచ్చి గొంతు మూగపోయిన బిడ్డతో "అమ్మా అని పిలువు బాబూ" అంటూ చేసిన ఆ సీను నటన అనే పదానికే మకుటాయమానంగా నిలిచింది. ఈ దృశ్యానికిప్రేక్షకులు విచలితులు అయిపోయారు. మూగ బిడ్డ రాముతో చివరివరకు సాగిన ప్రస్థానంలో ఎన్ టి ఆర్ నటన అత్యద్భుత రీతిలో సాగింది. మంటలు రేపే నెలరాజ అనే పాటకు ఆయన చూపిన సున్నితమైన హావభావాలు ప్రేక్షకులను మైకంలో పడవేసాయి.
దానికితోడుగా లక్ష్మిగా జమున, తన శాంతియుతమైన యుక్తమైన నటనతో సన్నివేశాలను, ఆర్ద్రతతో హుందాతనంతో, నిండుతనం చేకూర్చారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించగా, ఎస్.వి.రంగారావు, మాస్టర్ రామూ తమ పాత్రలను ఎంతో సహజంగా నటించి మెప్పించారు.
ఏ వి ఎం పతాకం లో ఇంతకుముందు వచ్చిన తెలుగు సినిమాలు సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద చిత్రాల స్తాయిలో ఆంధ్ర ప్రేక్షకులను మెప్పించిన చిత్రం రాము. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. 1968 లో దక్షిణ భారత దేశంలో విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, ఒరియా బాషలలో వచ్చిన సినిమాలలో రజతోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం తెలుగులో వచ్చిన రాము సినిమా మాత్రమే.
బరువైన కధాశం కలిగిన ఈ సినిమాలో రేలంగి, పద్మనాభం, గీతాంజలి, సూర్యాకాంతం అందించిన హాస్యం ప్రేక్షకులకు రిలీఫ్ నిస్తుంది.
విలన్ పాత్ర పోషించిన రాజనాల అభినయంలో హాస్యం మిళితమైనందున మంచి రిలీఫ్ లభించింది.
ఎ వి ఎం ప్రస్థానంలో అతి పెద్ద సంచలనం "రాము". 1968 లో ఈ చిత్రానిదే అగ్రస్థానం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఈ చిత్రం కలుగచేస్తుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 181 రోజులు ప్రదర్శించబడింది. సూపర్ హిట్ ఆఫ్ ది యియర్ గా 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.
మంచి చిత్రాలను ఇష్టపడే వారు ఎప్పుడైనా, ఎన్నిమార్లైనా చూడదగ్గ చిత్రం ఏ వి ఎం వారి "రాము".
పాటలన్నీ ఆణిముత్యాలే.
రాము చిత్రంలోని గీతాలు, చిత్ర ప్రారంభంలో రాము (మాస్టర్ రాజ్ కుమార్) పై చిత్రీకరించిన సుమతి శతకం పద్యం అక్కరకు రాని చుట్టము (గానం- పి.సుశీల)
తొలుత రాము పాడిన గీతం పుష్పలత, ఎన్.టి.ఆర్, మాస్టర్ రాజ్ కుమార్ ల పై ఒకసారి, మరోసారి జమున, ఎన్.టి.ఆర్ రాములపై చిత్రీకరణ ‘పచ్చనిచెట్టూ ఒకటి వెచ్చని చిలకలు రెండు’ (పి.సుశీల, ఆరుద్ర) ‘వలపుల చిలక, పలకని చిలక, చిలకా రాజు మదిలో సుఖమేది’ సన్నివేశానుగుణమైన గీతం, చరణాలలో రావటం విశేషం.

జమునపై చిత్రీకరించిన ‘కలగంటి కలగంటి చరణం’ వెనుక ఎన్.టి.ఆర్.పై ‘మంటలురేపే నెలరాజా’ వెన్నెలలో ఎంతో ఆర్ద్రత, వేదన నిండిన గీతం (పి.సుశీల, ఘంటసాల, దాశరథి) ఎన్.టి.ఆర్. అభినయం ప్రాణంపోసింది.

గీతాంజలి, సూర్యాకాంతం, రమణారెడ్డి, పద్మనాభంలపై చిత్రీకరించిన ‘తారాశశాంకం’ నాటకం (ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పిఠాపురం, ఎం.ఆర్.తిలకం- రచన కొసరాజు)

జమున, మాస్టర్ రాజ్ కుమార్, ఎన్.టి.ఆర్లపై చిత్రీకరించిన మరో గీతం జమున హుషారుగా, ఎన్.టి.ఆర్. నిర్వేదన, రామూ ఆనందం (మామిడికొమ్మా మళ్ళీమళ్ళీ పూయునులే’’- పి.సుశీల- దాశరథి)

రాము చిత్రంలో మరో మధురమైన భక్తిగీతం ఘంటసాలవారు నాగయ్య, ఎన్.టి.ఆర్.ల కిరువురికీ ఒకేసారి ఒక చరణం చివరలో పాడడం విశేషం. ‘రారా కృష్ణయ్య రారాకృష్ణయ్య’ (రచన-దాశరథి- గానం ఘంటసాల బృందం). ఆర్.గోవర్ధనం స్వరాలతో ఈ చిత్ర
గీతాలు అలరించేలా సాగాయి.

రాము, రాజు సముద్రపు ఒడ్డున

ఎన్ టి ఆర్, రాజకుమార్, జమున

‘‘రాము’’ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శింపబడింది. తెలుగు చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నమోదుకావటం ఆనంద దాయకం.

No comments:

Post a Comment