కథానాయకుడు (1969)




కధానాయకుడు (27-02-1969)


1969 లో 52 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 11 సినిమాలలో నటించారు . వర కట్నం, కధా నాయకుడు, భలే మాస్టారు, గండికోట రహస్యం, విచిత్ర కుటుంబం, కదలడు వదలడు, నిండు హృదయాలు, భలే తమ్ముడు , అగ్గి వీరుడు, మాతృదేవత, ఏక వీర.


అక్కినేని నటించిన 8 సినిమాలు అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, భలే రంగడు, బుద్దిమంతుడు, సిపాయి చిన్నయ్య,


ఇతరులు నటించిన 33 సినిమాలు శ్రీ రామ కధ, మంచి మిత్రులు, దేవుడిచ్చిన భరత, లవ్ ఇన్ ఆంధ్రా, సప్త స్వరాలు, భలే అబ్బాయిలు, బంగారు పంజరం, బొమ్మలు చెప్పిన కధ, చిరంజీవి, అర్ధ రాత్రి, మహా బలుడు, శబాష్ సత్యం, ఆస్థులు అంతస్థులు, టక్కరి దొంగ చక్కని చుక్క, ముహూర్త బలం, సత్తెకాలపు సత్తెయ్య, మామకు తగ్గ కోడలు, జరిగిన కధ, జగత్ కిలాడీలు, పంచ కల్యాణి దొంగల రాణి, నాటకాలరాయడు, రాజ సింహ, అన్నదమ్ములు, ప్రేమ కానుక, ఉక్కు పిడుగు, మనుషులు మారాలి, ధర్మ పత్ని, కన్నుల పండగ, తారా శశాంకం, కర్పూర హారతి, ప్రతీకారం, గండర గండడు, బంధిపోటు భీమన్న 1969 లో విడుదలయ్యాయి.


రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' (27-02-1969) సూపర్ హిట్ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కధానాయకుడు సినిమా 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రజతోత్సవం కూడా జరుపుకుంది. నిర్మాతలకు ఒక రూపాయ పెట్టుబడికి 9 రూపాయల లాభం తెచ్చిమిది. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.


వర కట్నం (10-01-1969) , విచిత్ర కుటుంబం (28-05-1969) , నిండు హృదయాలు (15-08-1969) , మాతృదేవత (07-11-1969) , అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.


"గండికోట రహస్యం (01-05-1969) , మహ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు' (18-09-1969), జగత్ కిలాడీలు, మహాబలుడు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.


విశ్వనాధ సత్యనారాయణ గారి నవల ఏకవీర (04-12-1969) మ్యూజికల్ హిట్ గా నిలచింది. భలే మాస్టారు (27-03-1969), కదలడు వదలడు (09-07-1969), అగ్గి వీరుడు (17-10-1969), ఆదర్శ కుటుంబం, భలే రంగడు, సిపాయి చిన్నయ్య, నిరాశ పరిచాయి.

జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.


27-02-1969 న విడుదలైన కధానాయకుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా విశేషాలు:-


పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు. 23 ఆగస్టు, 1978లో గోపాలకృష్ణ పరమపదించారు. ‘కథానాయకుడు’ చిత్రంతో ‘బంగారు నంది పురస్కారం’ పొందిన నిర్మాత కావటం విశేషం. వీరి అల్లుడు వి బాలకృష్ణరావు ‘ఉషా పిక్చర్స్’ ద్వారా ప్రముఖ చిత్ర పంపిణీదారుగా ఖ్యాతి గడిస్తున్నారు. 27 ఫిబ్రవరి 1969న కథానాయకుడు చిత్రం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె ప్రత్యగాత్మ సోదరుడైన ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధరరావు కథానాయకుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.


కథ: ముళ్ళపూడి వెంకటరమణ

మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ

సంగీతం: టివి రాజు

కళ: బిఎస్ కృష్ణ

నృత్యం: తంగప్ప

స్టంట్స్: శ్యామ్సుందర్

కెమెరా: విఎస్ఆర్ స్వామి

నిర్మాత: కె గోపాలకృష్ణ

దర్శకత్వం: హేమాంబరధరరావు


సినిమా ఆరంభంలో ఒక చిన్న టౌన్ లో ప్రజలు కొంతమంది స్వార్ధపరులైన పెద్దమనుషుల చేతిలో ఎలా దోపిడీ కి గురి కాబడుతున్నారో చూపిస్తారు. ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరావు), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు.


దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (ఎన్ టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.


కధానాయకుడు సారధిగా ఎన్ టి ఆర్ , కధానాయకి జయగా జయలలిత ఎంతో విశిష్టంగా నటించారు. వీరిద్దరూ అద్భుత నటనా ప్రావీణ్యంతో తాము ఉన్న ప్రతి సన్నివేశానికి వన్నె చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.


దయానందంగా నాగభూషణం, సత్య మూర్తిగా మిక్కిలినేని, అప్పడు దొరగా అల్లు రామలింగయ్య చక్కగా నటించారు.


చిత్రంలో సారథి స్నేహితుడు సింహగా పద్మనాభం, అతని భార్య రమగా రమాప్రభ, ఆమె తల్లిదండ్రులుగా రాధాకుమారి, రావి కొండలరావు, పక్కింటి ఇల్లరికపు అల్లుడు పులి రాజుగా రాజ్బాబు, సుందరిగా పద్మ లక్ష్మి, సుందరి తల్లిగా జూనియర్ భానుమతి సమకూర్చిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.


చలపతి మాస్టారుగా నాగయ్య, సారధి అన్న శ్రీనివాసరావుగా ధూళిపాళ, కాకారావుగా కాకరాల, జయ అన్నగా ప్రభాకర రెడ్డి, అతని స్నేహితుడిగా ఆదుర్తి నరసిం హ మూర్తి, కోటీశ్వరుడిగా ముక్కామల, సారధి వదినగా టి జి కమలా దేవి, ఆమె పిల్లలుగా బేబీ పద్మిని, బేబీ మల్లిక , మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగిగా చలపతిరావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.


యువ దర్శకుడు శ్రీ కె హేమాంబరధర రావు ఈ చిత్రంతో అగ్ర శ్రేణి దర్శకుల జాబితాలో చేరారు. సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా, పట్టుతో అర్ధవంతంగా రూపొందించి కథను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత దయానందం, తరువాత సత్యమూర్తి, అప్పడు వరుసగా తమ చేతికర్రలతో ధర్మారావు వద్దకు వచ్చి, అతని మెడకు కర్రలతో బంధం వేసి అంతం చేయటం, బ్యాక్గ్రౌండ్లో సంఘంలో న్యాయం, ధర్మం, నీతి లక్షణాలను లెక్కచేయని వారి గురించి చెప్పించటం ఆసక్తికరం అనిపిస్తుంది. తిరిగి కైమాక్స్లో సారథిని అదేవిధంగా అంతం చేయాలని ముగ్గురూ కర్రలు బిగించగా, హీరో వాటిని ఛేదించి ముక్కలు చేసే సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.


ఇక ఈ ముగ్గురు దుర్మార్గులున్న ఇంటి మెట్లమీది సన్నివేశంలో.. 10నెలల జీతం కోసం ఉపాధ్యాయుడు చలపతి దీనంగా అర్థిస్తూ ‘ఆకలితో మావాళ్లు అలమటిస్తున్నారని చెప్పే సందర్భంలో -అల్లు రామలింగయ్య (మంచింగ్) తినటం, గొంతులార్చుకుపోతున్నాయనగా మిక్కిలినేని మందు తాగడం, మెట్లకింద వున్న నాగయ్యను గెంటి వేయించటం, వారు రోడ్డుమీద ఆకలితో నీరసంతో తూలటం, మరోచోట నాగభూషణం మందు తాగిన మత్తుతో తూలటం సమాంతరంగా చూపి విశ్లేషించటం దర్శకుని ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.


హాస్పిటల్లో డాక్టరు స్టాకులేదని మందివ్వక అతని మరణానికి కారణం కావటం, ఆ మెట్లముందు సారధి వార్నింగ్ ఒకసారి, మరోసారి చైర్మెన్ పదవి పోయిన సారథిని మెట్లమీంచి దిగుతూ దుర్మార్గ బృందం అతనిపై విస్కీ పోయటం, హేళన చేసి కొట్టిపడవేయటం వంటి సన్నివేశాలు కథలో పట్టును పెంచాయి.


మార్పు స్వభావం తెలిసిన శ్రీనివాసరావు జనతా స్కీమ్ క్రింద పేదవారివద్ద వసూలు చేసిన సొమ్ము దాచటం, అతన్ని బంధించి ఈ దుష్టులు హింసించటం, క్లైమాక్స్లో డబ్బుకోసం త్రవ్వకంలో మిక్కిలినేని, అల్లు రామలింగయ్యకు పాము, గబ్బిలాలు, తేళ్లు రావటం, అక్కడ దుష్టులతో హీరో పోరాటం ఎంతో ఉత్సుకత, సాహసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. నీతి, నిజాయితీ లక్షణాలు సామాన్యుల్లోనూ ఉంటాయని జయ పాత్ర ద్వారా చెబితే, తాగుబోతు నాగులు కూడా చెల్లెలికోసం మారటం ద్వారా మరింత బలంగా చూపించటం ఎన్నదగిన అంశం.


ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ సమకూర్చిన కధలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సంఘటనలు, పాత్రపోషణ సహజత్వానికి దగ్గరగా నిర్ధుష్టంగా ఉంటాయి.


శ్రీ భమిడిపాటి రాధా కృష్ణ సంభాషణలు ఎంతో భావస్పూర్తితో వెల్లివిరుస్తూ చిత్రానికి నిండుతనాన్ని తెచ్చాయి.


లోగడ ‘పెద్దమనుషులు’, ‘దేశద్రోహులు’ వంటి పలు చిత్రాల్లోని అంశాలకు మరింత రంజుగా కథను సమకూర్చుకొని ముళ్ళపూడివారు, దానికి తగ్గ నిత్యసత్యాల్లాంటి సంభాషణల్ని (విలన్లు సారథితో- మాలాంటి వాళ్లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు, వుంటారు. నీలాంటివాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. మీవల్ల దేశంలో, మనుషుల్లో మార్పు రాదు) సమకూర్చి భమిడిపాటి రాధాకృష్ణ, దర్శకుల రూపకల్పనకు జోడిగా మహానటుడు యన్టిఆర్ సన్నివేశాలకు తగిన సంయమనంతో కూడిన ముచ్చటైన అభినయం, తోటి నటీనటుల సహకారం చిత్రాన్ని విజయపథంవైపు నడిపించింది.


చిత్రంలో హీరో హీరోయిన్లపై ఒక్కటైనా యుగళగీతం, కనీసం కలలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క యుగళ గీతమైనా ఉంటే బావుంటుందేమోనని హీరో యన్టిఆర్ సూచించినపుడు, ఈ కథకు అది నప్పదు అని దర్శకులు హేమాంబరధరరావు చెప్పారు. దానిని ఎన్ టి ఆర్ ఎంతో హృద్యంగా అంగీకరించటం గొప్ప విశేషం.


అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించటం కోసం విజయావారు, ఏవిఎం వారు, ఎంజి రామచంద్రన్ కోరటం, దానికి ఎన్ టి ఆర్ ఆ వ్యవహారాలన్నీ దర్శకులు, నిర్మాతల అభిష్టానికే వదిలివేయటం జరిగింది.


శ్రీ వి ఎస్ ఆర్ స్వామి కెమెరా, బి ఎన్ కృష్ణ కళ, తంగప్ప నృత్యాలు, వాసు ఎడిటింగ్ చిత్రానికి ఒక సముచిత స్థాయిని చేకూర్చాయి.

ఇంతేనయా తెలుసుకోవయ్యా పాటలో వి ఎస్ ఆర్ స్వామి కెమెరా ప్రతిభ గూర్చి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.


చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే గోరంత దీపం వెలిగించినవాడే ఉత్తముడు. సంఘంలోని వివిధ రంగాల్లో విశృంఖల విహారం చేస్తున్న అవినీతిని, మోసాన్ని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే వాటిని ఎదుర్కోవడానికి చేసిన ఏ చిన్న ప్రయత్నం జరిగినా హర్షించదగినదే. సమాజంలోని దుష్ట శక్తులను నిర్మూలించి మనిషి మనుగడను సార్ధకం చేయడానికి ప్రతి ఒక్కచోటా ఒక కధానాయకుడు ఉద్భవించాలి అని చాటి చెప్పే గొప్ప సాంఘిక చిత్రం గోపాల కృష్ణ ప్రొడక్షన్స్ వారి "కధా నాయకుడు".


ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించగల ఇంత చక్కని చిత్రాన్ని నిర్మించిన కె గోపాల కృష్ణ ఎంతో అభివందనీయులు. ఉత్తమ అభిరుచులు, ఉన్నతమైన ఆశయాలు గల ఈ యువ నిర్మాత అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందారు.


కధానాయకుడు సినిమా రాజకీయ ట్రెండ్ సెట్టర్ గా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో సంచలనాలు సృష్టించి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. 1969 లో సూపర్ డూపర్ హిట్ గా ఆ సంవత్సరానికి నెంబర్ వన్ గా నిలచింది. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపమైన సారధి పాత్రలో ఎన్ టి ఆర్ నటన ఎవ్వరూ అందుకోలేని అందలాలకు చేరుకుంది. సన్నివేశపరంగా ఈ చిత్రాన్ని వర్ణించడం అసాధ్యం. యూ ట్యూబ్ లో కాకుండా మంచి ప్రింట్ లో చూడవలసిన సినిమా. ఈ టీ వీ సినిమాలో అప్పుడప్పుడు వేస్తుంటారు.


శ్రీ దాశరధి 3 పాటలు, శ్రీ కొసరాజు 4 పాటలూ రాశారు. పాటలు అన్నీ ఆకర్షణీయంగా వుంటాయి. శ్రీ టీ వీ రాజు కూర్చిన సంగీతం చిత్రానికి గొప్ప ఆకర్షణ అని చెప్పవచ్చు.


హీరో లక్షణాలను, కథను విశ్లేషిస్తూ ఆకట్టుకునేలా వాద్యంతో, బృంద నృత్యంతో, ఎన్ టి ఆర్- జయలలితలపై చిత్రీకరించిన గీతం -వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్య’ (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: కొసరాజు).


https://www.youtube.com/watch?v=t9gnfp5fdxs

జయలలితపై చిత్రీకరించిన గీతం , పళ్ళండి పళ్ళండి పళ్ళు, జామ పళ్ళు, కొసరాజు, ఎల్ ఆర్ ఈశ్వరి

https://www.youtube.com/watch?v=GnqDyspt4v0 

అద్దంలో హీరో తాను వలచిన అమ్మాయిగా జయను చూపించగా ఆనందంతో జయలలితచే నృత్య గీతం -ముత్యాల జల్లుకురిసే రతనాల’ (దాశరథి, సుశీల ). ఈ చిత్రంలో హిట్ సాంగ్లో ఒకటిగా ఇది నిలిచింది.

https://www.youtube.com/watch?v=jonlDR4dDwE 

మంచివాడు మా బాబాయి, దాశరధి, సుశీల, బెంగలూరు లత


https://www.youtube.com/watch?v=6WuIkIdcv8g

ఎన్ టి రామారావు, జయలలిత నృత్య కళాకారులతో నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ముక్కామల హావభావాలను చూపుతూ చిత్రీకరించిన (ప్రత్యేకించి రంగుల్లో) గీతం -ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం’ (గానం: ఘంటసాల బృందం, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=FDPjX0u75Gs

రాజ బాబు , పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం -రావేలా దయరాదా రావా ఇంటికి (గానం: పిఠాపురం, మాధవపెద్ది, రచన: దాశరథి). ఈ చిత్రంలోని మరో హిట్సాంగ్.


https://www.youtube.com/watch?v=Zcur0kv8vIM

జయలలిత, నాగభూషణంలపై ఇంట్లో ఆరుబయట వెన్నెల్లో చిత్రీకరిస్తే, జయలలిత రకరకాల స్టెప్స్, అలరించే నృత్యంతో వెరైటీగా సాగే గీతం -వయసు మళ్లిన బుల్లోడా (గానం: పి సుశీల, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=jqsTZuvnIqY

‘కథానాయకుడు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1969 సంవత్సరానికి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ పురస్కారంతో సత్కరించింది.

No comments:

Post a Comment