Showing posts with label ఉమ్మడి కుటుంబం(1967). Show all posts
Showing posts with label ఉమ్మడి కుటుంబం(1967). Show all posts

ఉమ్మడి కుటుంబం(1967)




 ఉమ్మడి కుటుంబం (20-04-1967)

మన దేశంలో ఆర్యుల కాలం నుండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఆనవాయితీ. పురాణాల్లో రామ లక్ష్మణులు, ఇతిహాసాల్లో పంచ పాండవులు అన్నదమ్ముల అన్యోన్యానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. సమాజం పురోగమించాలంటే ఉమ్మడికుటుంబాల్లో సహజీవనం, సహకారం మెండుగా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలసి మెలసి మెలగాలి. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు మొదలైన రోజుల్లో నందమూరి తారక రామారావు (ఎన్ టి ఆర్) నాటకీయతను జోడిస్తూ తన రామ కృష్ణ ఎన్ ఏ టి కంబైన్స్ సొంత సంస్థ తరపున "ఉమ్మడి కుటుంబం" పేరుతో సినిమా నిర్మించారు. తోడు దొంగలు సినిమా నిర్మించిన 13 ఏళ్ళ విరామం తర్వాత ఎన్ టి ఆర్ యోగానంద్ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం ఇది.

ఉమ్మడి కుటుంబము నుండి విడిపోయి వేరు కాపురం పెట్టి అందులో వైభోగం ఉందనుకునే వెర్రితనానికి, ఉమ్మడి కుటుంబంలో ఉంటూ అందులో చాటుగా డబ్బును మూటలు కట్టుకునే కోడళ్ళకు ఈ సినిమా ఒక గుణ పాఠం. అంతే కాదు. అంతస్థులనుబట్టి అల్లుళ్ళను ఆదరించే అత్తగార్లకు , ఇంట అలిగి అత్తగారి ఇళ్ళకు చేరుకొనే అల్లుళ్ళకు, చెప్పుడు మాటలకు, తప్పుడు నడతలకు చెంప పెట్టుగా తీర్చిదిద్దిన సినిమా ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా 1967 ఏప్రిల్ 20 న విడుదలై, 15 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకంగా 197 రోజులు ప్రదర్శితమై రజతోత్సవం జరుపుకుంది. ఆ చిత్ర విశేషాలు:-

ఎన్ టి ఆర్ ది ఒక విశిష్టమైన గ్రాఫ్. నటుడిగా పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చలనచిత్ర విభాగాల్లో అత్యధిక సినిమాలలో నటించిన ఘనత ఎన్ టి ఆర్ ది. 1953 లో పిచ్చి పుల్లయ్య సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టి 1993 లో శ్రీనాధ కవి సార్వభౌమ వరకూ తమ్ముడు త్రివిక్రమరావు, తనయుడు హరి కృష్ణ నిర్మాణ సారధ్యంలో 28 చిత్రాలు నిర్మించడం ఎన్ టి ఆర్ కే సాధ్యం అయింది. ఒకవైపు నటుడిగా రాణిస్తూ 18 చిత్రాలకు దర్శకత్వ భాధ్యతలు నిర్వహించిన ఘనతకూడా ఎన్ టి ఆర్ దే.

ఆయన నటించిన 302 చిత్రాలలో 152 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 1950 - 1984 మధ్యన ఎన్ టి ఆర్ నటించిన చలన చిత్రాలలో 39 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. 197 రోజులాడిన ఉమ్మడికుటుంబం సినిమా కూడా ఆ కోవలోకి చెందినదే.

అది ఒక చిన్న ఊరు. అందులో గడుసుమిల్లివారి ఉమ్మడి కుటుంబం ఉంటోంది. తల్లి (హేమలత) సంరక్షణలో నలుగురు కొడుకులు ఉంటున్నారు.

పెద్దవాడు నాగయ్య (రేలంగి) పొరుగూరిలో గుమస్తా ఉద్యోగం చేస్తూ కుటుంబ భారం మోస్తున్నాడు. అతని భార్య గౌరి (సూర్యాకాంతం) కి ఒక కొడుకు కిట్టూ (రాజ్య లక్ష్మి). భర్త సంపాదనంతా ఉమ్మడి కుటుంబానికే ఖర్చు అయిపోతోందని ఆమె ఆవేదన.

రెండవవాడు చంద్రం (సత్యనారాయణ) ఉన్న రెండెకరాలు పండిస్తూ కుటుంబానికి కొమ్ము కాస్తున్నాడు. అతని భార్య కాంతం (ఎస్ వర లక్ష్మి). పిల్లలు లేరు కనుక వళ్ళు వంచి పని చేయాల్సిన అవసరమేముందని తలచే మనస్థత్వం కలది.

మూడవ వాడు ముకుందం (ప్రభాకర రెడ్డి). అత్తవారు ఇచ్చిన కట్నం డబ్బులతో డాక్టరీ పూర్తి చేశాడు. కుటుంబ ఆశలన్నీ అతనిమీదే. అతని భార్య రమ (సావిత్రి). అత్తగారికి చేదోడువాదోడుగా ఇంటి పనిలో సాయం చేస్తూ ఉంటుంది.

ఇక ఆఖరివాడు రాముడు (ఎన్ టి ఆర్) పనీ పాటు లేకుండా తిరుగుతున్నాడు. అయితే రాముకి వదిన రమ అంటే గౌరవం. కిట్టు అంతే ప్రాణం.

సంక్రాంతి పండగ రోజు కాంతం చేసిన గొడవతోను, భార్య రమ సంసార పక్షపు పద్ధతులు నచ్చకపోవడంతోను ముకుందం పట్నం వెళ్ళిపోయాడు.

నాగయ్య అప్పులు తీర్చలేక భూమి కౌలుకు ఇచ్చి వ్యవసాయం తీసేసాడు.

పట్నం వెళ్ళిన ముకుందం మోహిని (ఎల్ విజయ లక్ష్మి) అనే విలాసిని వలలో పడి పైసా కూడా ఇంటికి పంపకుండా ఇంటినే మరచిపోయాడు.

తోడి కోడళ్ళ మధ్య సయోధ్య కుదరక చంద్రం భార్య కాంతం పుట్టింటికి పయనమయ్యింది. చంద్రం కూడా ఆమె వెంటే నడిచాడు.

ఇల్లు గడవటం కష్టమైపోయింది. నాగయ్య భార్య గౌరి ఉమ్మడి ఇంటిని తడికలు పెట్టి వేరు చేసింది.

వదిన రమను అన్న ముకుందానికి అప్పగించాలని రాము మద్రాసు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రాముడికి శారద (కృష్ణ కుమారి) అనే ఒక జమీందారు (నాగభూషణం) గారి అమ్మాయితో పరిచయమయ్యింది. రాముడి ఇంటి పరిస్థితి, అన్న ముకుందం మోహిని వలలో చిక్కుకోవడం తెలుసుకుంది. మోహినికి బుద్ధి చెప్పి, ముకుందానికి కళ్ళు తెర్పించేందుకు రాముడిని నవ నాగరీకుడిగా తీర్చిదిద్ది అతడిని ఒక జమీందారులా భ్రమింపచేసేలా తయారుచేసి మోహినివద్దకు పంపింది. రాముడు మోహినిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి, ముకుందానికి ఆమె మీద విరక్తి కలిగేలా చేశాడు.

పల్లెటూరులో రమ ఒంటరిగా ఉండడంతో పశుపతి (అల్లు రామలింగయ్య) ఆమెను బలాత్కరించబోయాడు. అవమానం భరించలేక ఆమె ఆత్మ హత్యకు పూనుకుంటే అత్త సముదాయించి, ఆమెను ముకుందానికి అప్పగించేందుకు మద్రాసు బయలుదేరింది.

అత్తవారిల్లు చేరిన చంద్రానికి అవమానం జరిగింది.

రాముడు, శారద కలిసి పరిస్థితులు చక్కదిద్ది, ముకుందాన్ని రమను కలిపారు. విడిపోయిన ఉమ్మడి కుటుంబాన్ని ఒక తాటిమీదకు తెచ్చారు. రాముడు శారదలకు వివాహం జరపడంతో శుభం కార్డు పడింది.

ఇతర ముఖ్య పాత్రలలో ముక్కామల, రాజబాబు, వాణిశ్రీ, చాయాదేవి నటించారు.

సినిమాకు కధ, స్క్రీన్ ప్లే ఎన్ టి ఆర్ సమకూర్చగా, సముద్రాల జూనియర్ సంభాషణలు , రవికాంత్ నగాయిచ్ చాయాగ్రహణం భాద్యతలు నిర్వహించారు. ఎన్ టి ఆర్ కు సన్నిహిత మిత్రుడు యోగానంద్ దర్శకత్వం నిర్వహించారు.

ఎన్ ఏ టి ఆస్థాన సంగీత దర్శకులు టీ వీ రాజు గారు ఉమ్మడి కుటుంబం చిత్రానికి సంగీతం నిర్వహించగా, విజయా కృష్ణ మూర్తి సహకారం అందించారు.

ఈ సినిమాలో రెండు అంతర్నాటకాలు ఉన్నాయి.

మొదటిది సతీ సావిత్రి. క్షీరాబ్ది పై తేలు శ్రీ హరి పానుపు అనే సీస పద్యం తో ప్రారంభమయే ఈ నాటకంలో యముడు (ఎన్ టి ఆర్) కు పద్యాలు ఘంటసాల , సావిత్రిగా నటించిన వాణిశ్రీ కి పద్యాలు కనకం ఆలపించగా మాటలు ఎవరికి వారే చెప్పుకున్నారు. రాజబాబు సత్యవంతుడిగా కనిపిస్తాడు.

https://www.youtube.com/watch?v=SglK0nVAqg0

ఇక రెండవ నాటకం లంకా దహనం. ఇందులో ఎన్ టి ఆర్ రావణుడిగా, వాణిశ్రీ సీతగా , ఆంజనేయుడి పాత్రను రాజబాబు పోషిం చారు.

 https://www.youtube.com/watch?v=WG6I043J9qs

కొసరాజు రాసిన తస్సాదియ్యా తమాషైన బండి పాటను ఎన్ టి ఆర్, కృష్ణ కుమారిలపై చిత్రీకరించారు. ఈ పాట మధ్యలో వచ్చే మాటలను ఎన్ టి ఆర్ పలకడం విశేషం.

https://www.youtube.com/watch?v=ku7hlJ6HfEM

ఘంటసాల , పి.సుశీల  ఆలపించిన భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే

సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే

ఎవరి మనసు చెదిరేనో ఎన్ని కళ్ళు బెదిరేనో

ఎన్ని కళ్ళు బెదిరిన గాని నిన్ను విరిగి పూయనుగాని

ఉక్కు తునకలే నా మనసు ఒక్క నీకే అదితెలుసు

కొండ మీద కోతిని కొత్త వరస అటాడించి

పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో

పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో

కొండ మీద కోతిని పట్టి కోరిన నీ ముందర పెట్టి

గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా

గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా

భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి

https://www.youtube.com/watch?v=hsYsc4w7jgw

ఘంటసాల, సుశీల యుగళ గీతం చెప్పాలని ఉంది దేవతయే దిగి వచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది

రచన : సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

చెప్పాలని ఉంది..

చెప్పాలని ఉంది..దేవతయే దిగివచ్చి

మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి

మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది

కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి

కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి

మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..

ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో

నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే...

నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే..

ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు

ఆ ..ఆ..ఆ..ఆ..ఆ

https://www.youtube.com/watch?v=nEsieFqB8N0

సి నా రె రాసిన మరో పాట హలో మై డియర్ హలో ను ఎన్ టి ఆర్ విజయ లక్ష్మి లపై చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=h3eItDpxYQw

ఘంటసాల పాడిన చేతికి చిక్కావే పిట్టా, నువు చచ్చినా నిన్ను ఒదిలి పెట్ట పాటలో కూడా ఎన్ టి ఆర్ గళం కలిపారు.

https://www.youtube.com/watch?v=h2P_rIB6nO0

ఇక టైటిల్ సాంగ్ కుటుంబం, చల్లని హృదయాలకు చక్కని ప్రతి బింబం ఘంటసాల, లీల పాడారు.

ఈ సినిమాలో అన్ని పాటలూ జన రంజకమైనవే.

మరి కొన్ని విశేషాలు:-

నట రత్న నట జీవితం లో పెన వేసుకు పోయిన సినిమా ప్రదర్శన శాల విజయవాడలోని దుర్గా కళా మందిరం. 1949 లో ఎన్ టి ఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం నుండి 1993 లో ఎన్ టి ఆర్ నటించిన ఆఖరి చిత్రం శ్రీనాధ కవి సార్వభౌముడి వరకూ 63 చిత్రాలు ఈ హాలులోనే ప్రదర్శితమయ్యాయి. అలాంటి దుర్గా కళా మందిరం లో ఎన్ టి ఆర్ నిర్మించిన ఉమ్మడి కుటుంబం సినిమా 197 రోజులాడింది. ఈ సినిమాకు ముందు ఎన్ టి ఆర్ నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయం 113 రోజులు, ఈ సినిమా తర్వాత నిర్మించిన వర కట్నం 100 రోజులు ఈ హాలులోనే ఆడడం విశేషం. ఈ సినిమా హాలులో ఎన్ టి ఆర్ సినిమాలు 31 చిత్రాలు శతదినోత్సవం, 9 చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి.

సొంత బ్యానర్ పై పుష్కర కాలం తరవాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబం. 1955 జయ సిం హ తర్వాత ఎన్ టి ఆర్ వరుసగా పాండు రంగ మహాత్మ్యం, సీతా రామ కల్యాణం, గులేబకావళి కధ, శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలు నిర్మించారు. వీటి తర్వాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబమే.

ఎన్ టి ఆర్ నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య (1953) లో నటించిన 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఎన్ టి ఆర్ పక్కన కృష్ణ కుమారి నాయకిగా నటించారు.

ఎన్ టి ఆర్ కు జోడీ గా అనేక చిత్రాలలో నటించిన సావిత్రి, ఉమ్మడి కుటుంబం లో వదినగా నటించారు.

బభ్రువాహన 1964 , సత్య హరిశ్చంద్ర 1965 లో ఎన్ టి ఆర్ కు కధానాయికగా నటించిన ఎస్ వర లక్ష్మి ఉమ్మడి కుటుంబం లో క్యారెక్టర్ నటిగా చేశారు.

మంచి మనసులు లో విలన్ గా నటించిన నాగభూషణం ఎస్ వి ఆర్ వంటి నటుడు పోషించవలసిన పాత్రను పోషించడం ఎన్ టి ఆర్ సమయోచిత నిర్ణయానికి ప్రతీక.

అలాగే విలన్ పాత్రలకు పరిమితమైన సత్యనారాయణలోని కరుణ రసంతో కూడిన అద్భుత నటనకు అవకాశమిచ్చి, అతడిని నవరస నటనా సార్వభౌముడిగా మలచిన చిత్రం ఉమ్మడి కుటుంబం.