Showing posts with label గౌతమి పుత్ర శాతకర్ణి (2017). Show all posts
Showing posts with label గౌతమి పుత్ర శాతకర్ణి (2017). Show all posts

గౌతమి పుత్ర శాతకర్ణి (2017)




"గౌతమి పుత్ర శాతకర్ణి"

తన కొడుకుని యుద్ధ రంగానికి భర్త తన వెంట కొనిపోతున్నాడనే విషయం ఒక నేపధ్య కధాగానం ద్వారా దేశపు మహారాణికి తెలియచెప్పటం దగ్గర నుండి దర్శకుడి ప్రతిభ ప్రతి సన్నివేశంలో కొట్టవచ్చినట్లు కనపడుతుంది ఈ చిత్రంలో. మాతృమూర్తినే కాకుండా స్త్రీలందరినీ గౌరవించాలనే విషయం చాలా బలంగా ఉన్న సంభాషణలు గుర్తు చేస్తాయి . "నేను అగ్ర తాంబూలం ఇస్తున్నది మా అమ్మకి కాదు - అమ్మకి" అనటం ద్వారా అమ్మ అందరి కన్నా చాలా గొప్పది అనే విషయం చాలా సహజంగా చెబితే - ఎన్నో రోజుల తరువాత అదీ యుద్ధరంగం నుండి వచ్చిన భర్తను ప్రేమతో దరి చేరినప్పుడు బిడ్డ ఏడుపుకి చలించి ఆత్రుతతో పాలు పడుతున్న భార్య తో చెప్పే "మాతృత్వానికి, మగతనానికి శరీరంతోనే ఆకలి తీరుస్తారు ఆడవాళ్ళు" అనే ఒక్క వాక్యం స్త్రీ మూర్తి యెక్క గొప్పతనాన్ని అంబరం మీద నిలిపింది.
సంభాషణలను రాయకలిగిన వారి దగ్గరి నుండి బాగా రాయుంచుకోవటం కాకుండా వాటిని ప్రదర్శించటానికి అనువైన సన్నివేశాలు కల్పించిన దర్శకుడి నేర్పు బాగా ఆకట్టుకుంటుంది. సాహో - అంజనాపుత్ర క్రిష్.

దూతగా వచ్చిన వాడు - "నేను నిన్ను బంధిస్తే" అనే శత్రురాజుతో "వారు వస్తారు - నేను కారాగారం లో ఎదురు చూస్తాను " అని సమాధానం ఇవ్వటమే కాకుండా "మరి వధిస్తే" అన్న ప్రశ్నకు "మీరు వస్తారు - కాటి దగ్గర ఎదురు చూస్తాను" అని చెప్పటం ద్వారా తన రాజు ఎంత శౌర్యవంతుడో అనే విషయాన్ని ఈ రెండు సంభాషణల తోనే చూపించకలిగారు. "కాలం చేసి అయినా కాలాన్ని కనడం " అనే వాక్యప్రయోగం మనలను రోమాంచితులను చేస్తుంది. సాహో - జయ లక్ష్మీ పుత్ర బుర్రా సాయి మాధవ్.

తండ్రి బ్రతికి ఉంటే ఆయన ప్రశంసలు పొందకలిగే రీతిలో నటించాడు బాలయ్య. శాతకర్ణి అంటే ఇలాగే ఉండే వాడు అనిపించటం అతనికి క్రిష్ ద్వారా దొరికిన నూరవ చిత్ర అదృష్టం.


*శాతకర్ణికి ఇతడే ఒకసైన్యం - సాయి మాధవ్ బుర్ర గారి Dialogues*

'అతడి మాటలు.. తూటాలు' అనుకుంటే పొరపాటు. ఎందుకంటే తూటాలకు లిమిట్ ఉంటుంది. కాని అతడి మాటల తూటాలు అన్ లిమిటెడ్. పేలుతూనే ఉంటాయి.
*అతడి ప్రతి అక్షరంలోనూ భావం పరిమళిస్తూనే ఉంటుంది. ఆ భావం ఆలోచనలను రేకెత్తించి కదిలిస్తూనే ఉంటుంది.*
మాట మనసును తాకటం ఒక ఎత్తయితే.. కళ్లనుండి అశ్రువులు రప్పించడం మాటల రచయిత 'సాయి మాధవ్ బుర్రా'కే చెల్లింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాతో ఈ రచయిత *నా అక్షరాలు ఉరకేలేసే సముద్రం* లాంటివని నిరూపించాడు. క్రిష్ , సాయి మాధవ్ లోని ప్రతిభని ‘అక్షరా’లా వందకి వందశాతం ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ప్రవాహంలా సాగిన అతని మాటల తూటాలను చూద్దాం..


*శాతకర్ణిలో బుర్రా సాయి మాధవ్ గారు రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్:*

"వెళ్లి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు.. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గది గదికీ మధ్య గోడలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాది అని కొట్టుకుంటాం.. కాని ఎవడో వచ్చి.. నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం. . సరిహద్దుల్లోనే మీకు స్మశానం నిర్మిస్తాం.. మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం".
"యవనుడైనా.. వాడి జనకుడైనా... అడుగుపెట్టినచోటే ఆరడగులు దానిమిస్తా.. ఆయువు తీస్తా.."
"మారావు అనుకున్నా.. గెలిచిన రాజ్యాలు మార్చలేదు.. వలచిన ఇల్లాలు మార్చలేదు."
"మగనాలికి గాజులు అందం.. మగాడికి గాయాలు అందం."
"మాతృత్వానికి, మగతనానికి శరీరంతోనే ఆకలి తీరుస్తారు ఆడవాళ్ళు"
"ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల."
"తెలుగువాడు అధముడు కాదు ప్రధాముడు."
"అదుపులో పెట్టడానికి అసువుపోసే స్త్రీ పసువు కాదు".
"తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.. తల్లిని మించిన తనయుడు ఉంటాడా"?
"ఓడించా.. మారలేదు.. క్షమించా.. మారలేదు.. వధించా.. ఇక మారాల్సిన అవసరం లేదు".
"ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం.. ఇక ఉనికిని చాటుదాం."
"నా రాజ్యంలో పాలించడానికి కాదు. యాచించడానికి కూడా అనుమతించను."
"నేను అగ్ర తాంబూలం ఇస్తున్నది మా అమ్మకి కాదు - అమ్మకి"
"మమకారం అహంకారం రెండూ లేని వాడే నాయకుడు అవుతాడు."
"శరణం అంటే రక్ష... రణం అంటే మరణశిక్ష ఏది కావాలి".
"ఆడదాని కడుపులో నలిగినలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి."
"కథలు మనం చెప్పుకోకూడదు నాన్నా... మన కథను ప్రజలు చెప్పుకోవాలి."
"సింహం, చీమ యుద్ధంలో వెనుదిరగవు, సింహం చచ్చేవరకూ పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చేవరకూ కుట్టికుట్టి చంపుతుంది."
"నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి."
"మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నా."
సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా? ఇది భావి భారత చక్రవర్తిగా.. ఈ దక్షణ పథాధిపతి ఆజ్ఞ.."