శ్రీ కృష్ణ పాండవీయం(1966)




దర్శకుడు గా పనిచేస్తూ రెండు పరస్పర విరుద్ధ మైన పాత్రలను అత్యుత్తమంగా ధరించిన
సినిమా శ్రీ కృష్ణ పాండవీయం (13-01-1966)

కథ కొంత కల్పన. మహాభారతాన్ని పూర్తిగా అనుసరించలేదు. అయితే ఇక్కడా దుర్యోధనుడు ఉద్ధతుడే గాని ఉదాత్తుడు కాడు. ఔచిత్యం చెడలేదు. శ్రీ కృష్ణుడి కీ దుర్యోధనుడి కీ ఆహార్యం ఎంత వైచిత్రి తో, వైరుధ్యం తో- ఉండగలదో అంతా ఉంటుంది. ఆ విషయం లో రామారావు కు ప్రత్యేక శ్రద్ధ. చిత్రకళలో ప్రవేశం ఉండటం ఒక కారణం. సౌమ్యత్వం, ప్రసన్నత, అభిజాత్యం, దురభిమానం - పాత్ర లను చూడగానే అన్నీ స్ఫురిస్తాయి. స్ఫురించాలని రామారావు పట్టుదల.
కృష్ణ పాండవీయం లో రుక్మిణీ కల్యాణాన్ని రమ్యాతిరమ్యంగా తీశారు.రుక్మిణీదేవి విదర్భ రాకుమారి గనుక మహారాష్ట్ర వధువు అలంకారం లో దర్శనమివ్వటం ఒక మెరుపు. పోతన్న పద్యాలను దాదాపు యథాతథం గా పాడించటం అతులిత మాధురీ మహిమ. ఆ లోకోత్తర ప్రణయానుభూతి కి లోను కాకుండా ఉండటం అవదు - కృష్ణుడు రుక్మిణి నడుము పట్టుకుని ఒక్క తృటిలో రథం మీదికి ఎత్తి నప్పుడు అక్కడ పాత్రధారులుండరు , లక్ష్మీ నారాయణులు తప్ప. ఆ. పోతన్న అంటేనే అది, ముంచెత్తటం.

శ్రీ కృష్ణ పాండవీయం సినిమా ను చూసి " బాగా తీశావురా " అని విశ్వనాథ అంటే " మీరు నేర్పినదే మాస్టారూ " అని రామారావు జవాబు చెప్పడం. ఇది ఒక గాథే అయి ఉండనూ వచ్చు, వాళ్ళుఆ స్థాయి మనుషులు గనుక.

రచన: పోతన
గానం : ఘంటసాల
సంగీతం : టీ వీ రాజు
తెరపై : ఎన్ టి ఆర్, కె ఆర్ విజయ, గీతాంజలి మున్నగువారు
దర్శకత్వం : ఎన్ టి ఆర్
కెమెరా : రవికాంత్ నగాయిచ్

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు.
కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క ; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపు వన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని

1966 లో 32 తెలుగు చిత్రాలు విడుదల కాగా, ఎన్ టి ఆర్ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్ నాలుగు చిత్రాల్లోనూ నటించారు.

1966 సంవత్సరంలో సంక్రాంతికి నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో ఎన్ టి ఆర్ రూపొందించిన 'శ్రీకృష్ణ పాండవీయం', ఫిబ్రవరిలో రామినీడు దర్శకత్వంలో పల్నాటి యుద్ధం, మార్చిలో రాజ్యం పిక్చర్స్ శకుంతల, ఏప్రిల్ లో సి పుల్లయ్యగారి దర్శకత్వంలో ఆ ఏడాది సూపర్ హిట్ సినిమా పరమానందయ్య శిష్యుల కధ, మే లో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ, జూన్ నెలలో ఎన్ టి ఆర్, విఠలాచార్య కలయికలో రూపొందిన 'అగ్గిబరాటా', జూలై నెలలో సంగీత లక్ష్మి, ఆగస్టులో శ్రీ కృష్ణ తులాభారం , సెప్టెంబర్ నెలలో అడుగుజాడలు, పిడుగు రాముడు , అక్టోబరులో డాక్టర్ ఆనంద్ విడుదలయ్యాయి.

ఇవి కాక చైల్డ్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'లేత మనసులు' , మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్, 'గూఢచారి 116' 'చిలకా-గోరింక', కె.ఎస్.ఆర్.దాస్ 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అక్కినేని నటించిన 4 సాంఘిక చిత్రాలు ఆత్మ గౌరవం, నవరాత్రి, ఆస్థిపరులు, మనసే మందిరం విడుదలయ్యాయి.
1966 సంవత్సరం జనవరి 13వ తేదీ విడుదలైన శ్రీ కృష్ణ పాండవీయం సినిమా విశేషాలు:-
నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ (ఎస్‌.ఏ.టి) అనగానే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి నటరత్న ఎన్‌.టి.రామారావు. అరవై ఏళ్ళుగా ఈ సంస్థ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. చిత్రరంగంలో నిలదొక్కుకున్న తొలి రోజులలోనే ప్రజారంజకమైన సినిమాలు నిర్మించాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్‌ 1952లోనే నేషనల్‌ ఆర్ట్స్‌ సంస్థను నెలకొల్పారు. చిత్ర పరిశ్రమకు రాకముందు ఆ సంస్థ పేరు మీదే నాటకాలు వేసేవారు. తొలి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ‘‘సీతారామ కళ్యాణం’ సొంత చిత్రంలో రాముడి వేషం కాకుండా ప్రతినాయకుడైన రావణుని పాత్ర పోషించి మెప్పించారు. అదే స్ఫూర్తితో ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమాలో ఎన్టీఆర్‌ అటు కృష్ణుడుగా, ఇటు సుయోధనుడుగా రెండు విభిన్న పాత్రలలో నటించి, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించారు. చిత్రానువాదంతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి, ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నారు. గతంలో ‘‘సీతారామ కళ్యాణం’, ‘గులేబకావళి కథ’ సినిమాలకు ఎన్టీఆరే దర్శకత్వం వహించినా తన పేరు మాత్రం క్రెడిట్స్‌లో వేసుకోలేదు. అయితే రామకృష్ణ: ఎస్‌.ఏ.టి. కంబైన్‌ పతాకంపై నిర్మించిన ఈ ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలోనే ఆయన పేరు దర్శకునిగా మొదటిసారి వెండితెరమీద దర్శనమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 1966న విడుదలైన ఈ చిత్రం తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

‘‘సీతారామకల్యాణం’ సినిమాకు రావణబ్రాహ్మ పాత్రను విలక్షణంగా ఆవిష్కరించిన సముద్రాల రాఘవాచార్య ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమా కోసం భారత భాగవతాది గ్రంధాలలో వుండే ఉపాఖ్యానాలను నేపధ్యంగా తీసుకుని కథ అల్లి సంభాషణలు సమకూర్చారు. ఎన్టీఆర్‌ చిత్రానువాదాన్ని సొంతంగా రూపొందించుకున్నారు. సుయోధునుడి స్వాభిమాన ప్రవృత్తిని, రుక్మిణీదేవి - శ్రీకృష్ణుల ప్రణయ గాథను, భీమసేనుని సాహస కృత్యాలను ప్రముఖంగా చూపి ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్‌దే. శ్రీకృష్ణునిగా, సుయోధునునిగా ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. విజయవారి ‘‘మాయాబజార్‌’’ గొప్పతనానికి సరితూగిన సత్తా కలిగిన సినిమా ‘శ్రీక్రిష్ణ పాండవీయం’’.

మీర్జాపురం రాజావారు జయా ఫిలింస్ బ్యానర్పై 1938లో నిర్మించిన ‘శ్రీకృష్ణ జరాసంధ’ (వేమూరి గగ్గయ్య, ఎంవి రాజమ్మ కాంబినేషన్) చిత్రం కొంత ప్రేరణగా, భారత భాగవత గ్రంథాల్లోని, ఉప కథలను జోడించి సముద్రాలతో రచన చేయించి చిత్రకథను ఎన్ టి ఆర్ సిద్ధం చేసుకున్నారు. నెగెటివ్ పాత్రను పోజిటివ్ గా మలచి మెప్పించగల మేటి ఎన్ టి ఆర్ పురాణాలను శోధించి సుయోధనుని పాత్రను మరింతగా తీర్చిదిద్ది శ్రీకృష్ణునిగా, తొలిసారి సుయోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది.

రచన: సీనియర్ సముద్రాల
పాటలు: కొసరాజు, సి నారాయణరెడ్డి
నృత్యం: వెంపటి సత్యం
కళ: టివియస్ శర్మ
ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్,
ఎడిటింగ్: జిడి జోషి
సంగీతం: టివి రాజు
స్టంట్లు: సాంబశివరావు, స్వామినాథన్
నిర్మాత: త్రివిక్రమరావు
చిత్రానువాదం, దర్శకత్వం: ఎన్ టి రామారావు

కుంతీదేవి (ఎస్ వరలక్ష్మి) శ్రీకృష్ణుని (ఎన్ టి ఆర్) తన కుమారులకు ఎల్లవేళలా అండగా ఉండమని కోరటం చిత్ర ప్రారంభం. పాండవుల ప్రజ్ఞను ఓర్వలేని సుయోధనుడు (ఎన్ టి ఆర్) మనోగతం, శకుని వృత్తాంతం, వారణాసిలో పాండవుల లక్షాగృహ దహనయత్నం, శ్రీకృష్ణుని సాయంతో భీముడు కుటుంబాన్ని రక్షించుకోవటం, హిడింబి ప్రేమ, భీముడు హిడింబాసురుని సంహరించటం, భీమునికి హిడింబికి వివాహం, కుంతీదేవి కోరికపై శ్రీకృష్ణుడు రుక్మిణీ కల్యాణ ఘట్టం, ఏకచక్రపురవాసులైన పాండవులు, భీముడు బకాసురుని సంహారం, అర్జునుడు (శోభన్ బాబు) మత్స్యయంత్రం ఛేదించి ద్రౌపదిని చేపట్టటం, తల్లిమాటపై ఆమె వారందరికీ పత్ని కావటం, ఇంద్రప్రస్తానికి వచ్చిన పాండవులు, మరల భీముడు జరాసంధుని (ముక్కామల)తో పోరాడి సంహరించటం, పాండవులు రాజసూయ యాగం నిర్వహణ, సుయోధనుడు మయసభలో భంగపడటం, పాండవ ద్వేషం హెచ్చటం, యాగానంతరం శ్రీకృష్ణునికి అగ్రపూజ నిర్వహిస్తున్నందుకు పాండవులనూ, శ్రీకృష్ణునీ నిందించిన శిశుపాలుడు (రాజనాల) సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుని చేత మరణించటం, విశ్వరూప సందర్శనంతో చిత్రం ముగుస్తుంది.
కొన్ని ముఖ్యపాత్రల్లో ధర్మరాజు (బాలయ్య), శకుని (ధూళిపాళ), నారదుడు (కాంతారావు), రుక్మి (సత్యనారాయణ), రుక్మిణి తండ్రి భీష్మకుడు (నాగయ్య), రుక్మిణి (కెఆర్ విజయ), చెలికత్తె మాలతి (గీతాంజలి), హిడింబి (నాగరత్నం), ధృతరాష్ట్రుడు (మల్లాది), భీష్ముడు (మిక్కిలినేని), ద్రోణుడు (కెవియస్ శర్మ), కర్ణుడు (ప్రభాకరరెడ్డి), దుశ్శాసనుడు (జగ్గారావు), అగ్నిద్యోతనుడు (వంగర) నర్తకీమణులు భారతి, తిలకం.

దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో వినూత్న కోణంలో చూపించారు. దుర్యోధనునికి సమకూర్చిన సంభాషణలు విలక్షణంగా ఉంటాయి. రుక్మిణిగా నటించిన కె.ఆర్‌.విజయ ముగ్ధ మనోహరంగా ఉంటుంది. భీముడిగా కన్నడ ఉదయ్‌కుమార్‌ నటన అద్భుతంగా కుదిరింది.
కథాపరంగా భీముని పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో దానికి ప్రముఖ కన్నడ నటుడు ఉదయకుమార్ ను ఎన్నుకోవటంలో ఎన్టీఆర్ విజ్ఞత గోచరిస్తుంది. భీమునిగా ఉదయకుమార్ ఆవేశకావేశాలను, కొంత చతురతను, శౌర్య, ప్రతాపాలను సన్నివేశానుగుణంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులంతా తమ ప్రజ్ఞాపాటవాలను, నటకౌశలాన్ని పాత్రలకు తగినట్టు అభినయించారు. వారిలో నయవంచక శకునిగా ధూళిపాళ, అందాలతార కెఆర్ విజయ రుక్మిణిగా తన ముగ్ధమోహన సౌందర్యంతో, లలిత శృంగారాభినయంతో మురిపించటం ఎన్నదగిన అంశాలు.

ఇక సుయోధనునిగా ఎన్ టి ఆర్ పాత్ర ప్రవేశంలోనే ఒక గాంభీర్యాన్ని ఆహార్యంలో తలపై పెద్ద కిరీటం, వెనుకవేలాడే చేలాంచలం, పాండవులను తలచుకుంటూ పలికే మాటలు ‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించు రారాజును’ అని ఒక పర్యాయము, మరోసారి మయసభలో భంగపడి ద్రౌపదిని తలచుకుంటూ ‘పాంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహసించునది? సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును నేడొక అబల బంధకీ అపహసించుటయా’ అంటూ సన్నివేశంలో కిరీటం లేకుండా అటుఇటూ తిరుగుతూ, ద్రౌపది మంటపాల మధ్యలో ముగ్గురిగా పలువురిగా కన్పించటం, దుర్యోధనుని తలచుట్టూ వందలకొద్ది గిర్రున తిరగడం, శకుని మాటలు ఆలకించి కొంత యోచన, కొంత ఆనందం రారాజు ముఖంలో ప్రతిఫలించటం ఆకట్టుకునేలా చిత్రీకరించి అబ్బురమనిపించారు.

ఇక రెండోవైపు స్వాతికాభినయంతో కూడిన శ్రీకృష్ణునిగా చల్లని, చక్కని చిరునవ్వుతో శాంత, అభయముద్రను చేపట్టి, ఆపన్నులనాదుకోవటం, భీమునిలో పౌరుషం రేకెత్తించడంలో సుయోధనుని చెయ్యగలిగింది లేనపుడు చేయి కలపటం మంచిది అని అనునయించటం, శిశుపాలుని నిందలు చిరునవ్వుతో సహించి చివరకు ఆగ్రహంతో చక్రం ప్రయోగించటం, రెండు పాత్రలను ఎంతో కఠోర దీక్షా దక్షతలతో వైవిధ్యభరితంగా మెప్పించటం ఆ నట సార్వభౌమునికే చెల్లింది. దర్శకునిగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చిత్రీకరణలో వైవిధ్యాన్ని చూపటం విశేషం.
వాహిని స్టూడియోలో నిర్మించిన మయసభ సెట్టింగుని చూసేందుకు నిర్మాత త్రివిక్రమరావు ఎవ్వరినీ అనుమతించేవారు కాదట. చివరికి ఆ స్టూడియో నిర్మాత నాగిరెడ్డికి కూడా ఆ సెట్టింగు చూసేందుకు అనుమతి లభించకపోతే, విషయం తెలుసుకున్న నందమూరి సోదరులు నాగిరెడ్డిని సగౌరవంగా ఆహ్వానించి మయసభ సెట్‌ చూపించారట.
ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్, కళాదర్శకులు టివియస్ శర్మ రూపొందించిన అద్భుతమైన మయసభ సెట్టింగ్స్, దుర్యోధనుని సభ, లాక్షాగృహం, హిడింబి నృత్య సన్నివేశం సెట్, రుక్మిణి మందిరం, బకాసురుని వద్ద ఎముకల గుట్టలు, జరాసంధుని భవనం ముందువైపు, హిడింబాసురుడు చెట్లనుండి పడిన కాయలన్నీ తినటం, భీముని దెబ్బకు అవి నోటినుంచి కింద పడడం, మత్స్యయంత్రం దానికి కృష్ణుని మురళీ అడ్డుపడడం, ఇంకా పలు సభా భవనాలు, శిల్పసుందరులు, ముఖ్యంగా మయసభలో ఓ పుష్పం శిల్పంపై తుమ్మెదలు నిజమైన పుష్పం అని భ్రమపడి తిరుగాడ్డం అద్భుతంగా చిత్రీకరించారు.

సాంబశివరావు, స్వామినాథన్ లు ఈ చిత్రంలో భీమ, హిడింబాసుర, భీమబకాసుర, భీమ జరాసంధ యుద్ధాలను ఎంతో వివరంగా వైవిధ్యంగా రూపొందించటం మెచ్చతగినది.
శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలలో ఉత్తమ ద్వితీయ చిత్రంగా పురస్కారం పొందింది.
పిల్లలకు, పెద్దలకు మన పౌరాణికాలలో విశేషాలు ఎంతో అర్ధవంతంగా, పంచభీమ ప్రహసనం, గాంధార రాజసుతుల చెరసాల, వెన్నెముక నుంచి పావులు తయారుకావటం, శకుని దుర్బోధలకు కారణం ఇటువంటి సంగతులు అద్భుతమైన చిత్రీకరణతో వాటికి శాశ్వతత్వాన్ని ఈ చిత్రం ద్వారా కలుగచేయటం ఎంతో అభినందించదగ్గ విషయం. ఒక చరిత్రకు ఆధారంగా నిలిచిన విశిష్ట చిత్రం ‘శ్రీ కృష్ణ పాండవీయం. ఈ యాభై సంవత్సరాలుగా ఈ చిత్ర గీతాలు నేటికీ నిత్యనూతనంగా విరాజిల్లటం ఓ మధురానుభూతికి ఆలవాలం కావటం ప్రత్యేక విశేషం.
స్వీయ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న అపురూప రమణీయం శ్రీ కృష్ణ పాండవీయం. పౌరాణిక చిత్రాల వరుసలో మహాద్భుతం. ప్రేక్షక లోకాన్ని విస్మయ పరచి మరో లోకానికి తీసుకు పోయిన రస గంగా ప్రవాహం.

ద్విపాత్రల వైభవాన్ని కన్నుల పండుగ్గా చూపిన దిగ్దర్శక మహా నటుడు ఎన్ టి ఆర్. శ్రీ కృష్ణ, దుర్యోధనుల మధ్య అభినయ వైవిధ్యాన్ని అత్యంత మనోహరంగా, అపార వైభవంగా ఆవిష్కరించిన ఘనత ఎన్ టి ఆర్ దక్కించుకున్నారు. శ్రీ కృష్ణుని ఆపన్న హస్తాన్ని, దుర్యోధనుని అద్వితీయ వైభవాన్ని తెరకెక్కించిన ప్రజ్ఞా ప్రాభవం ప్రేక్షకులను మోకరిల్ల చేసింది.
మయ సభ మనోహరం, సుయోధనుని మతిభ్రంశం, అవమానాగ్నితో రగిలిన ఆగ్రహోదగ్ర హృదయం తెరపై రచించిన దర్శక నైపుణ్యం మహా మహిమాన్వితం. రుక్మిణీ కల్యాణ ఘట్టం రమణీయ మనోరంజకం, సర్వ పాప హరణం. ఏక చక్ర పుర ప్రహసనం సుశోభితం సర్వ జన రంజకం.

కన్నడ నటుడు ఉదయ కుమార్ ను భీమునిగా మలిచిన తీరుకు జనం పరవశం చెందారు. అతని నట జీవితంలో ఈ పాత్ర ప్రత్యేకతను చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.
ధూళిపాళను మంచి నటుడిగా అందరూ ఎరుగుదురు. అతనిలోని నివురుగప్పిన నిప్పులాంటి అసమాన నటనను రగిల్చి ఒడలు గగుర్పాటును కలిగించే శకుని సమయస్పూర్తిని, క్రూరత్వాన్ని జ్వాజ్యలమానంగా తెరపై చూపిన విధం అత్యద్భుతం.
శకుని వేషానికి ఈ సినిమాలో ఒక విశిష్టత వుంది. దుర్యోధనుని దురాలోచనకు ఆజ్యం పోసే శకుని కౌరవ వినాశానికి ఎందుకు కారకుడయ్యాడనే ప్రశ్నకు ఈ సినిమాలో సమాధానం దొరుకుతుంది. దుర్యోధనునికి దీటుగా శకుని సంభాషణలుంటాయి.
అలాగే శకుని రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడిస్తూ ‘పితుహూ’’ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ ప్రతాకారేచ్ఛతో నవ్వే నవ్వులో దూళిపాళ ప్రదిర్శంచిన నటన అపూర్వం!

ఇతర ప్రధానపాత్రల్లో కాంతారావు నారదుడుగా, యస్‌.వరలక్ష్మి కుంతీదేవిగా, బాలయ్య ధర్మరాజుగా, శోభన్‌ బాబు అర్జునుడుగా, రాజనాల శిశుపాలుడుగా, సత్యనారాయణ రుక్మిగా, రత్న హిడింబగా ఒదిగిపోయి నటించారు.
ఎన్ టి ఆర్ ప్రతిభ ప్రతి గ్రామాన్ని చర్చా నిలయం చేసింది. అక్షర రూపంలో అభినందనల పరంపర ఎన్ టి ఆర్ ఆఫీసును ఆక్రమించింది. ఈ చిత్రం 9 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుని 125 రోజుల రన్ ను సాధించింది. అటు పరిశ్రమనూ, ఇటు ప్రజలను, విమర్శకులను, పండిత పామరులను పులకాంకితం చేసిన అపురూప చిత్ర శ్రీ కృష్ణ పాండవీయం.
ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతిగా రజత నందిని బహుకరించింది. 

తమిళంలో ఇదే సినిమాను ‘‘కన్నన్ కరుణై ’’ పేరుతో 1971 లో నిర్మించారు. ఎన్ టి ఆర్ కృష్ణుడిగా , కె ఆర్ విజయ రుక్మిణి గా నటించారు. ఉదయకుమార్ తమిళ్ లో కూడా భీముడిగా వేసారు. దుర్యోధనుడు మొదలైన మిగిలిన పాత్రలుఎన్ తమిళ్ నటులు పోషించారు. ఎన్  టి ఆర్ దర్శకత్వ భాద్యత కూడా వహించారు.
కె ఆర్ విజయ తెలుగులో ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. తమిళంలో ఇదే సినిమాను ‘‘కన్నన్ కరుణై ’’ పేరుతో 1971 లో నిర్మించారు. ఎన్ టి ఆర్ కృష్ణుడిగా , కె ఆర్ విజయ రుక్మిణి గా నటించారు. ఉదయకుమార్ తమిళ్ లో కూడా భీముడిగా వేసారు. దుర్యోధనుడు మొదలైన మిగిలిన పాత్రలుఎన్ తమిళ్ నటులు పోషించారు. ఎన్  టి ఆర్ దర్శకత్వ భాద్యత కూడా వహించారు.

కె ఆర్ విజయ తెలుగులో ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. 
ఈ చిత్ర నిర్మాణ వ్యయం సుమారు ఏడు లక్షలు. రెండేళ్ల తరువాత మరలా విడుదలచేసినప్పుడు, ఈ సినిమా యాభై రోజులకుపైగా ఆడింది. 1986లో ఈ సినిమా హక్కులను ఆంధ్రా, సీడెడ్‌ ప్రాంతాలకు యాభై రోజులకు పైగానే ఆడింది. రిపీట్‌ రన్‌లో హైదరాబాద్‌ నగరంలో ఈ సినిమా శతదినోత్సవం చేసుకోవడం కూడా ఒక రికార్డే.
టివి రాజు, ఎన్ టి ఆర్ కాంబినేషన్లోని చిత్రాల గీతాలన్నీ అమృతానంద స్వరాలతో అలరిస్తాయి. అదే కోవలోనే ఈ చిత్రంలోని గీతాలు మనకు వినిపిస్తాయి.
పాటలు, పద్యాలు, అద్భుత రసానుభూతితో వీనుల విందుగా మురిపించాయి.

పోతన రుక్మిణీ కల్యాణం - వెండి తెరపై అపురూప సృష్టి శ్రీ కృష్ణ పాండవీయం.
“నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో
లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో?
భగ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిం బ్రవర్తించునో?
ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యము లేల? నీవు నీ
తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్రు గాని వి
చ్చేయుము; శత్రులన్నుఱుము జేయుము చేయుము శోభనం బిలన్
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
వచ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలం
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

1. రుక్మిణీ కల్యాణం

2. సుయోధనుడి పరిచయం

3. శకుని చెరసాల


4. తండ్రితో దుర్యోధనుడు...జనకా...

5. శ్రీ కృష్ణుడు, భీమునిపైన చిత్రీరించిన గీతం, దీనిలో శ్రీ కృష్ణుడు ఒకవైపు, మధ్యలో శయ్యపై నిద్రిస్తున్న భీముడు, మరోవైపు మారువేషంలో శ్రీకృష్ణుడు మూడు ఒకే ఫ్రేములో చూపటం, సందేశాత్మక గీతం -మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా’ (కొసరాజు- ఘంటసాల). శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి లక్కయింటికి కాపలా కాస్తున్న భీమునికి జాగ్రత్తలు చెప్ప గీతమిది. ఇందులో ‘‘పవిత్రాయాణ సాధూనాం’’ అనే భగవద్గీత శ్లోకాన్ని ‘‘కర్తవ్యం నీవంతు, కాపాడుట నావంతు... చెప్పడమే నాధర్మం, వినకపోతే నీ ఖర్మం’’ అని ముందుగానే హెచ్చరించడం నచ్చే విషయం.

6. భీముని మోహించిన హిడింబి నాగరత్నంపై చిత్రీకరించిన గీతం -చాంగురే బంగారు రాజా గొప్పగా అలరిస్తుంది. ఈ గీతంలో -కైపున్న మచ్చకంటి చూపు/ అది చూపుకాదు పచ్చల పిడిబాకు, విచ్చిన పూరేకు..’ (సినారె -జిక్కి) అంటూ సాగే చరణానికి చేతిలో పిడిబాకు, మరో చేతిలో పూవుతో రత్నను చూపటం, మరోసారి పెద్ద శంఖంపై ఇద్దరు, ముగ్గురు, ఐదుగురిగా రత్న కన్పించటం ఉదయకుమార్ ను కవ్విస్తూ నృత్యభంగిమలలో ఆకట్టుకోవటం చక్కని చిత్రీకరణతో సాగుతుంది. సినారే రాసిన మరొక గీతం హిడింబ భీముని వరించి పాడే ‘‘ఛాంగురే బంగారు రాజా’’ అనే జిక్కిపాట. సినారే ఈ పాటను రాసేముందు ఎన్టీఆర్‌ కొన్ని నిబంధనలు విధించారు. హిడింబ రాక్షసాంగన. ఆమె మానవాంగనగా మారి భీముని వరించే పాట కనుక వాడుకలోలేని పదాలతో, ప్రౌఢసమాసాలతో, జానపద ధోరణిలో, ఉసిగొలిపేలా ఉండాలనేది ఆ నిబంధన. సినారె వాడుకలోలేని అచ్చతెలుగు పదాలతో ఆ పాటకు రూపమిచ్చారు. ‘‘మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా - అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా’’ అంటూ పల్లవి సాగుతోంది. చరణాల్లో మొలకమీసం, సింగపు నడుము, అమ్మకచెల్ల, మచ్చెకంటి, కైదండ వంటి జాను తెలుగు పదాలతో సినారె పాటకు గుబాళింపు తెచ్చారు. టి.వి.రాజు అద్భుతమైన స్వరాలు అందించి ఈ పాటను హిట్‌ చేశారు.

7. ఎన్ టి ఆర్ , కెఆర్ విజయపై చిత్రీకరణ, పెళ్ళికిముందు రుక్మిణి అంతఃపురంలో వారిరువురూ బయట గీతాంజలి నృత్యం, సత్యనారాయణలపై చిత్రీకరణ -ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి (ఘంటశాల, పి సుశీల). చక్కని అలరింపుతో సాగిన పాట నేటికీ అలరించటం విశేషం. టి.వి.రాజు రాగేశ్వరి రాగంలో ఆ గీతానికి బానీ కట్టారు. త్యాగరాజుస్వామి ‘‘సాధించనే మనసా’’ అనే కృతిలో వాడిన ‘‘సమయానికి తగు మాటలు’’ అనే పదాన్ని సముద్రాల ఇందులో వాడడం విశేషం.

8. ప్రాణేశ

9. కనియెన్ రుక్మిణి

10. రుక్మి గర్వ భంగం

11. రుక్మిణి, శ్రీకృష్ణుల తొలిరేయి చెలుల నృత్యగీతం -నల్లనివాడైనా ఓ చెలీ చల్లనివాడేలే’ (జిక్కి, ఎల్ఆర్ ఈశ్వరి బృందం).

12. భీముడు, బండినిండా ఆహారంతో వెళ్తూ పాడే పాట భళా భళీ నా బండి పరుగూతీసే బండి (కొసరాజు- మాధవపెద్ది).

13. ద్రౌపదీ స్వయంవరం

14. చిత్రం చివర మయసభలో సుయోధనుడు ఎన్ టి ఆర్, నర్తకీమణులు భారతి బృందం చక్కని నృత్యంతో సాగే అద్భుత గీతం -స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా (సినారె -పి లీల, పి సుశీల). చక్కని సంగీతం సాహిత్యాలతో జోడుగుర్రాల్లా ఈ గీతం సాగుతుంది. ఎన్టీఆర్‌కి ‘దుర్యోధన’ అనే పదం కన్నా ‘సుయోధన’ అనే పేరంటే ఇష్టం. అందుకే సినారె ఈ స్వాగత గీతంతో సుయోధన అనే పదాన్ని వాడారు. అంతేకాదు ప్రతి చరణం చివర ఒక సంస్కృత ప్రౌఢసమాజాన్ని ఉపయోగించారు. ‘‘శతసోదర సంసేవిత సదనా, అభిమానధనా సుయోధనా’’ అంటూ పల్లవితో మొదలై ‘‘ధరణిపాల శిరోమకుట మణి తరుణకిరణ పరిరంజిత చరణా’’ అనే మొదటి చరణంతోనూ ‘‘కదనరంగ బహుదండధృత గదా ప్రకట పటు శౌర్యాభరణా’’ అనే రెండో చరణంతోనూ పాట సాగుతుంది. అర్ధంకాని సమాసాలున్నా, ప్రేక్షకులకు అర్ధంకాకున్నా ఈ పాటను గొప్పగా ఆదరించారు. సుశీల, లీల బృందం ఆలపించిన ఈ పాటను టివి రాజు హంసధ్వని రాగంలో స్వరపరిచారు. అంతేకాకుండా స్వాగత గీతం కనుక పాశ్చాత్య వాద్యాలను కూడా వాడి గంభీర ‘‘కాహళ’’ ధ్వనులతో అలరించారు.

15. మయ సభ -01

16. మయ సభ -02

17. మయ సభ -03

18. మయ సభా పరాభవం

19. జరాసంధుని శయ్యా గృహం

20. అగ్ర పూజ

21. శిశుపాల వధ -01

22. శిశుపాల వధ -02

23. పురుష సూక్తం

ఈ చిత్రంలో రారాజు ప్రవేశమే అత్యద్భుతం. సంస్కృత పదభూయిష్టమైన దీర్ఘసమాసాలతో కూడిన ముందు మాటలను ఎన్టీఆర్‌ పలికిన తీరు నభూతో న భవిష్యతి. ‘‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమై, దశౌక్షౌహిణీ సేనావాహినీ పరిరక్షితమై, శాత్రవ భయంకరమైన, ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను’’ అంటూ స్వోత్కర్షతో సాగే మాటలు రారాజు అతిశయాన్ని, దర్పాన్ని, అహంకారాన్ని, వెరిసి పాండవుల మీది అసూయను ప్రతిబింబిస్తాయి. పాత్రప్రవేశంలోనే ఈ లక్షణాలను చూపించడం ఎన్టీఆర్‌ స్క్రీన్‌ప్లే రచనా సమర్ధతక, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. 
‘‘అణోరణీయాన్‌ మహతో మహియాన్‌’’ అనే ఉపనిషత్‌ సూక్తికి నిదర్శనం ఎన్టీఆర్‌.

ఉమ్మడి కుటుంబం(1967)




 ఉమ్మడి కుటుంబం (20-04-1967)

మన దేశంలో ఆర్యుల కాలం నుండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఆనవాయితీ. పురాణాల్లో రామ లక్ష్మణులు, ఇతిహాసాల్లో పంచ పాండవులు అన్నదమ్ముల అన్యోన్యానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. సమాజం పురోగమించాలంటే ఉమ్మడికుటుంబాల్లో సహజీవనం, సహకారం మెండుగా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలసి మెలసి మెలగాలి. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు మొదలైన రోజుల్లో నందమూరి తారక రామారావు (ఎన్ టి ఆర్) నాటకీయతను జోడిస్తూ తన రామ కృష్ణ ఎన్ ఏ టి కంబైన్స్ సొంత సంస్థ తరపున "ఉమ్మడి కుటుంబం" పేరుతో సినిమా నిర్మించారు. తోడు దొంగలు సినిమా నిర్మించిన 13 ఏళ్ళ విరామం తర్వాత ఎన్ టి ఆర్ యోగానంద్ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం ఇది.

ఉమ్మడి కుటుంబము నుండి విడిపోయి వేరు కాపురం పెట్టి అందులో వైభోగం ఉందనుకునే వెర్రితనానికి, ఉమ్మడి కుటుంబంలో ఉంటూ అందులో చాటుగా డబ్బును మూటలు కట్టుకునే కోడళ్ళకు ఈ సినిమా ఒక గుణ పాఠం. అంతే కాదు. అంతస్థులనుబట్టి అల్లుళ్ళను ఆదరించే అత్తగార్లకు , ఇంట అలిగి అత్తగారి ఇళ్ళకు చేరుకొనే అల్లుళ్ళకు, చెప్పుడు మాటలకు, తప్పుడు నడతలకు చెంప పెట్టుగా తీర్చిదిద్దిన సినిమా ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా 1967 ఏప్రిల్ 20 న విడుదలై, 15 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకంగా 197 రోజులు ప్రదర్శితమై రజతోత్సవం జరుపుకుంది. ఆ చిత్ర విశేషాలు:-

ఎన్ టి ఆర్ ది ఒక విశిష్టమైన గ్రాఫ్. నటుడిగా పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చలనచిత్ర విభాగాల్లో అత్యధిక సినిమాలలో నటించిన ఘనత ఎన్ టి ఆర్ ది. 1953 లో పిచ్చి పుల్లయ్య సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టి 1993 లో శ్రీనాధ కవి సార్వభౌమ వరకూ తమ్ముడు త్రివిక్రమరావు, తనయుడు హరి కృష్ణ నిర్మాణ సారధ్యంలో 28 చిత్రాలు నిర్మించడం ఎన్ టి ఆర్ కే సాధ్యం అయింది. ఒకవైపు నటుడిగా రాణిస్తూ 18 చిత్రాలకు దర్శకత్వ భాధ్యతలు నిర్వహించిన ఘనతకూడా ఎన్ టి ఆర్ దే.

ఆయన నటించిన 302 చిత్రాలలో 152 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 1950 - 1984 మధ్యన ఎన్ టి ఆర్ నటించిన చలన చిత్రాలలో 39 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. 197 రోజులాడిన ఉమ్మడికుటుంబం సినిమా కూడా ఆ కోవలోకి చెందినదే.

అది ఒక చిన్న ఊరు. అందులో గడుసుమిల్లివారి ఉమ్మడి కుటుంబం ఉంటోంది. తల్లి (హేమలత) సంరక్షణలో నలుగురు కొడుకులు ఉంటున్నారు.

పెద్దవాడు నాగయ్య (రేలంగి) పొరుగూరిలో గుమస్తా ఉద్యోగం చేస్తూ కుటుంబ భారం మోస్తున్నాడు. అతని భార్య గౌరి (సూర్యాకాంతం) కి ఒక కొడుకు కిట్టూ (రాజ్య లక్ష్మి). భర్త సంపాదనంతా ఉమ్మడి కుటుంబానికే ఖర్చు అయిపోతోందని ఆమె ఆవేదన.

రెండవవాడు చంద్రం (సత్యనారాయణ) ఉన్న రెండెకరాలు పండిస్తూ కుటుంబానికి కొమ్ము కాస్తున్నాడు. అతని భార్య కాంతం (ఎస్ వర లక్ష్మి). పిల్లలు లేరు కనుక వళ్ళు వంచి పని చేయాల్సిన అవసరమేముందని తలచే మనస్థత్వం కలది.

మూడవ వాడు ముకుందం (ప్రభాకర రెడ్డి). అత్తవారు ఇచ్చిన కట్నం డబ్బులతో డాక్టరీ పూర్తి చేశాడు. కుటుంబ ఆశలన్నీ అతనిమీదే. అతని భార్య రమ (సావిత్రి). అత్తగారికి చేదోడువాదోడుగా ఇంటి పనిలో సాయం చేస్తూ ఉంటుంది.

ఇక ఆఖరివాడు రాముడు (ఎన్ టి ఆర్) పనీ పాటు లేకుండా తిరుగుతున్నాడు. అయితే రాముకి వదిన రమ అంటే గౌరవం. కిట్టు అంతే ప్రాణం.

సంక్రాంతి పండగ రోజు కాంతం చేసిన గొడవతోను, భార్య రమ సంసార పక్షపు పద్ధతులు నచ్చకపోవడంతోను ముకుందం పట్నం వెళ్ళిపోయాడు.

నాగయ్య అప్పులు తీర్చలేక భూమి కౌలుకు ఇచ్చి వ్యవసాయం తీసేసాడు.

పట్నం వెళ్ళిన ముకుందం మోహిని (ఎల్ విజయ లక్ష్మి) అనే విలాసిని వలలో పడి పైసా కూడా ఇంటికి పంపకుండా ఇంటినే మరచిపోయాడు.

తోడి కోడళ్ళ మధ్య సయోధ్య కుదరక చంద్రం భార్య కాంతం పుట్టింటికి పయనమయ్యింది. చంద్రం కూడా ఆమె వెంటే నడిచాడు.

ఇల్లు గడవటం కష్టమైపోయింది. నాగయ్య భార్య గౌరి ఉమ్మడి ఇంటిని తడికలు పెట్టి వేరు చేసింది.

వదిన రమను అన్న ముకుందానికి అప్పగించాలని రాము మద్రాసు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రాముడికి శారద (కృష్ణ కుమారి) అనే ఒక జమీందారు (నాగభూషణం) గారి అమ్మాయితో పరిచయమయ్యింది. రాముడి ఇంటి పరిస్థితి, అన్న ముకుందం మోహిని వలలో చిక్కుకోవడం తెలుసుకుంది. మోహినికి బుద్ధి చెప్పి, ముకుందానికి కళ్ళు తెర్పించేందుకు రాముడిని నవ నాగరీకుడిగా తీర్చిదిద్ది అతడిని ఒక జమీందారులా భ్రమింపచేసేలా తయారుచేసి మోహినివద్దకు పంపింది. రాముడు మోహినిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి, ముకుందానికి ఆమె మీద విరక్తి కలిగేలా చేశాడు.

పల్లెటూరులో రమ ఒంటరిగా ఉండడంతో పశుపతి (అల్లు రామలింగయ్య) ఆమెను బలాత్కరించబోయాడు. అవమానం భరించలేక ఆమె ఆత్మ హత్యకు పూనుకుంటే అత్త సముదాయించి, ఆమెను ముకుందానికి అప్పగించేందుకు మద్రాసు బయలుదేరింది.

అత్తవారిల్లు చేరిన చంద్రానికి అవమానం జరిగింది.

రాముడు, శారద కలిసి పరిస్థితులు చక్కదిద్ది, ముకుందాన్ని రమను కలిపారు. విడిపోయిన ఉమ్మడి కుటుంబాన్ని ఒక తాటిమీదకు తెచ్చారు. రాముడు శారదలకు వివాహం జరపడంతో శుభం కార్డు పడింది.

ఇతర ముఖ్య పాత్రలలో ముక్కామల, రాజబాబు, వాణిశ్రీ, చాయాదేవి నటించారు.

సినిమాకు కధ, స్క్రీన్ ప్లే ఎన్ టి ఆర్ సమకూర్చగా, సముద్రాల జూనియర్ సంభాషణలు , రవికాంత్ నగాయిచ్ చాయాగ్రహణం భాద్యతలు నిర్వహించారు. ఎన్ టి ఆర్ కు సన్నిహిత మిత్రుడు యోగానంద్ దర్శకత్వం నిర్వహించారు.

ఎన్ ఏ టి ఆస్థాన సంగీత దర్శకులు టీ వీ రాజు గారు ఉమ్మడి కుటుంబం చిత్రానికి సంగీతం నిర్వహించగా, విజయా కృష్ణ మూర్తి సహకారం అందించారు.

ఈ సినిమాలో రెండు అంతర్నాటకాలు ఉన్నాయి.

మొదటిది సతీ సావిత్రి. క్షీరాబ్ది పై తేలు శ్రీ హరి పానుపు అనే సీస పద్యం తో ప్రారంభమయే ఈ నాటకంలో యముడు (ఎన్ టి ఆర్) కు పద్యాలు ఘంటసాల , సావిత్రిగా నటించిన వాణిశ్రీ కి పద్యాలు కనకం ఆలపించగా మాటలు ఎవరికి వారే చెప్పుకున్నారు. రాజబాబు సత్యవంతుడిగా కనిపిస్తాడు.

https://www.youtube.com/watch?v=SglK0nVAqg0

ఇక రెండవ నాటకం లంకా దహనం. ఇందులో ఎన్ టి ఆర్ రావణుడిగా, వాణిశ్రీ సీతగా , ఆంజనేయుడి పాత్రను రాజబాబు పోషిం చారు.

 https://www.youtube.com/watch?v=WG6I043J9qs

కొసరాజు రాసిన తస్సాదియ్యా తమాషైన బండి పాటను ఎన్ టి ఆర్, కృష్ణ కుమారిలపై చిత్రీకరించారు. ఈ పాట మధ్యలో వచ్చే మాటలను ఎన్ టి ఆర్ పలకడం విశేషం.

https://www.youtube.com/watch?v=ku7hlJ6HfEM

ఘంటసాల , పి.సుశీల  ఆలపించిన భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే

సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే

ఎవరి మనసు చెదిరేనో ఎన్ని కళ్ళు బెదిరేనో

ఎన్ని కళ్ళు బెదిరిన గాని నిన్ను విరిగి పూయనుగాని

ఉక్కు తునకలే నా మనసు ఒక్క నీకే అదితెలుసు

కొండ మీద కోతిని కొత్త వరస అటాడించి

పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో

పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో

కొండ మీద కోతిని పట్టి కోరిన నీ ముందర పెట్టి

గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా

గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా

భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి

గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా

గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి

https://www.youtube.com/watch?v=hsYsc4w7jgw

ఘంటసాల, సుశీల యుగళ గీతం చెప్పాలని ఉంది దేవతయే దిగి వచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది

రచన : సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

చెప్పాలని ఉంది..

చెప్పాలని ఉంది..దేవతయే దిగివచ్చి

మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి

మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది

కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి

కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి

మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..

ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో

నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే...

నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే..

ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు

ఆ ..ఆ..ఆ..ఆ..ఆ

https://www.youtube.com/watch?v=nEsieFqB8N0

సి నా రె రాసిన మరో పాట హలో మై డియర్ హలో ను ఎన్ టి ఆర్ విజయ లక్ష్మి లపై చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=h3eItDpxYQw

ఘంటసాల పాడిన చేతికి చిక్కావే పిట్టా, నువు చచ్చినా నిన్ను ఒదిలి పెట్ట పాటలో కూడా ఎన్ టి ఆర్ గళం కలిపారు.

https://www.youtube.com/watch?v=h2P_rIB6nO0

ఇక టైటిల్ సాంగ్ కుటుంబం, చల్లని హృదయాలకు చక్కని ప్రతి బింబం ఘంటసాల, లీల పాడారు.

ఈ సినిమాలో అన్ని పాటలూ జన రంజకమైనవే.

మరి కొన్ని విశేషాలు:-

నట రత్న నట జీవితం లో పెన వేసుకు పోయిన సినిమా ప్రదర్శన శాల విజయవాడలోని దుర్గా కళా మందిరం. 1949 లో ఎన్ టి ఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం నుండి 1993 లో ఎన్ టి ఆర్ నటించిన ఆఖరి చిత్రం శ్రీనాధ కవి సార్వభౌముడి వరకూ 63 చిత్రాలు ఈ హాలులోనే ప్రదర్శితమయ్యాయి. అలాంటి దుర్గా కళా మందిరం లో ఎన్ టి ఆర్ నిర్మించిన ఉమ్మడి కుటుంబం సినిమా 197 రోజులాడింది. ఈ సినిమాకు ముందు ఎన్ టి ఆర్ నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయం 113 రోజులు, ఈ సినిమా తర్వాత నిర్మించిన వర కట్నం 100 రోజులు ఈ హాలులోనే ఆడడం విశేషం. ఈ సినిమా హాలులో ఎన్ టి ఆర్ సినిమాలు 31 చిత్రాలు శతదినోత్సవం, 9 చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి.

సొంత బ్యానర్ పై పుష్కర కాలం తరవాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబం. 1955 జయ సిం హ తర్వాత ఎన్ టి ఆర్ వరుసగా పాండు రంగ మహాత్మ్యం, సీతా రామ కల్యాణం, గులేబకావళి కధ, శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలు నిర్మించారు. వీటి తర్వాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబమే.

ఎన్ టి ఆర్ నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య (1953) లో నటించిన 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఎన్ టి ఆర్ పక్కన కృష్ణ కుమారి నాయకిగా నటించారు.

ఎన్ టి ఆర్ కు జోడీ గా అనేక చిత్రాలలో నటించిన సావిత్రి, ఉమ్మడి కుటుంబం లో వదినగా నటించారు.

బభ్రువాహన 1964 , సత్య హరిశ్చంద్ర 1965 లో ఎన్ టి ఆర్ కు కధానాయికగా నటించిన ఎస్ వర లక్ష్మి ఉమ్మడి కుటుంబం లో క్యారెక్టర్ నటిగా చేశారు.

మంచి మనసులు లో విలన్ గా నటించిన నాగభూషణం ఎస్ వి ఆర్ వంటి నటుడు పోషించవలసిన పాత్రను పోషించడం ఎన్ టి ఆర్ సమయోచిత నిర్ణయానికి ప్రతీక.

అలాగే విలన్ పాత్రలకు పరిమితమైన సత్యనారాయణలోని కరుణ రసంతో కూడిన అద్భుత నటనకు అవకాశమిచ్చి, అతడిని నవరస నటనా సార్వభౌముడిగా మలచిన చిత్రం ఉమ్మడి కుటుంబం.

మహానాయకుడు (2019)



నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

తల్లి ఏదీ? తండ్రి ఏడీ?
అడ్డుతగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసు పొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్లు
నీదంటు ఏ చింత
సుంతైన లేని ఈ నేలపై
నడయాడు ఋషివో..

కృషితో నాస్తి దుర్భిక్షమని
లోకాన్ని శాసించు మనిషివో..
ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో..
నీవెవరివో.. ఎవరివో..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

జాగృతములో జాగు ఏదీ?
రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా..
అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగీ

కదనరంగాన కర్మయోగీ..

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు
నిష్క్రియాప్రచ్ఛన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు
నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు
మహా నాయకుడు ఇతడు...
మహా నాయకుడు ఇతడు...

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..


 చిత్రం: మహానాయకుడు (2019)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : శంకరాచార్య నిర్వాణ షట్కము,
కె.శివదత్త, కె.రామకృష్ణ, కీరవాణి
గానం : శరత్ సంతోష్, మోహన భోగరాజు,
కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల

రాము(1968)

రాము (04-05-1968)
(అనప్పిండి సూర్య లక్ష్మీ కామేశ్వర రావు)

1968 లో విడుదలైన 58 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 11 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 13 చిత్రాలలో, శోభన్ బాబు 7 చిత్రాలలో, హరనాధ్ 6 సినిమాలలో, ఇతరులు 8 చిత్రాలలో నటించారు. జయలలిత 5 తెలుగు చిత్రాలలో , కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు. సి ఎస్ రావు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జి వర లక్ష్మి, సావిత్రి దర్శకురాళ్ళుగా మారారు.
ఎన్ టి ఆర్ నటించిన రాము (04-05-1968) ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా రజతోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఎన్ టి ఆర్ నటించిన తల్లి ప్రేమ (09-03-1968), నిండు సంసారం (05-12-1968), నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), అక్కినేని నటించిన మంచి కుటుంబం కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన భాగ్య చక్రం , ,ఉమా చండీ గౌరీ శంకరుల కధ, కలిసొచ్చిన అదృష్టం, తిక్క శంకరయ్య, నిన్నే పెళ్ళడతా, నేనే మొనగాణ్ని, బాగ్దాద్ గజ దొంగ,
అక్కినేని నటించిన గోవుల గోపన్న, బంగారు గాజులు, బ్రహ్మచారి, సుడి గుండాలు,
కృష్ణ నటించిన అసాధ్యుడు, నిలువుదోపిడి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్ , అమాయకుడు, అత్తగారు కొత్త కోడలు, నేనంటే నేనే, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలికోసం, వింత కాపురం , లక్ష్మీ నివాసం,
కాంతారావు నటించిన అగ్గి మీద గుగ్గిలం, ఎవరు మొనగాడు, పేదరాసి పెద్దమ్మ కధ, భలే మొనగాడు, రాజ యోగం, రణ భేరి, సతీ అరుంధతి, దేవ కన్య, వీరపూజ , వీరాంజనేయ, జీవిత బంధం, కుంకుమ భరిణ, జీవిత బంధం,
శోభన్ బాబు నటించిన కలసిన మనసులు, చుట్టరికాలు, మన సంసారం, పంతాలు పట్టింపులు, భార్య, లక్ష్మీ నివాసం, కుంకుమ భరిణ,
హరనాధ్ నటించిన బంగారు సంకెళ్ళు, పెళ్ళి రోజు, నడ మంత్రపు సిరి, చల్లని నీడ, పాల మనసులు, సుఖ దుఖాలు,
ఇతరులు నటించిన పాప కోసం , భలే కోడళ్ళు, మూగ జీవులు, చిన్నారి పాపలు, లక్ష్మీ నివాసం, బాంధవ్యాలు, గ్రామ దేవతలు, బంగారు పిచిక , విడుదలయ్యాయి.
04-05-2020 కు 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాము చిత్రం విశేషాలు:-
ఏ.వి.మెయ్యప్పన్ 1938లో అల్లి అర్జున్ తో 1940 ప్రగతి స్టూడియోస్ ప్రారంభించి, కొన్ని చిత్రాలు రూపొందించారు. 1945లో మద్రాస్ లో శాంథోంలో ఎ.వి.యం.స్టూడియోస్ ప్రారంభించి పలు చిత్రాలు రూపొందించారు. వైజయంతి మాల నటిగా పరిచయమైన, ‘జీవితం’ చిత్రం వారి విజయవంతమైన చిత్రాల్లో ఒకటి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద, చిట్టి చెల్లెలు , రాము మొదలైన 100 పైగా చిత్రాలను నిర్మించిన సంస్థ. ఏ.వి.ఎం. 1968లో ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘రాము’.

1958లో అమెరికన్ చిత్రం ‘‘ది ప్రౌడ్ రెబల్’’ ఆధారంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, దర్శకుడు, ఆల్ రౌండర్ ఏ మేన్ ఆఫ్ ఆల్ వర్ట్యూస్ అయిన హిందీ నటుడు కిషోర్ కుమార్ 1964లో నిర్మించిన చిత్రం ‘‘దూర్ గగన్కి చాహున్ మైయి’’ తమ కిషోర్ ఫిలిమ్స్ బేనర్ పై కిషోర్ కుమార్ , సుప్రియాచౌదరి, అమిత్ కుమార్ కాంబినేషన్లో నిర్మించారు.
ఆ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు 1966లో ఎ.సి.త్రిలోక్చందర్ దర్శకత్వంలో, జావర్ సీతారాం స్క్రీన్ప్లే, సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్, సమకూర్చగా, జెమిని గణేషన్, పుష్పలత, కె.ఆర్.విజయ, మాస్టర్ రాము, ఎస్.ఎ.అశోకన్ కాంబినేషన్లో, యం.మురుగన్, కుమారన్, యం.శరవణన్, యం.బాలసుబ్రమణ్యం, నిర్మాతలుగా ‘రాము’ తమిళ చిత్రం రూపొందించారు. ఈ తమిళ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు నిర్మించిన తెలుగుచిత్రం రాము. ‘‘ఉమా ప్రొడక్షన్స్ సమర్పణ’.

నిర్మాణం: ఎ వి ఎం ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎం మురుగన్, ఎం కుమరన్, ఎం శరవణన్
దర్శకత్వం: ఎ సి త్రిలోక్చందర్, ఎం ఏ
స్క్రీన్ ప్లే : సీతారామన్ ఎం ఏ బి ఎల్
మాటలు : డి వి నరసరాజు, బి ఏ
పాటలు: దాశరధి, కొసరాజు, ఆరుద్ర
సంగీతం: ఆర్ గోవర్ధనం
కెమెరా: జి రాజగోపాల్
శవ్దగ్రహణం : జె ఏ మాణిక్యం
కథ, సంవిధానం జావర్ సీతారాం,
స్టంట్స్- శ్యాంసుందర్,
ఎడిటింగ్-ఆ.జి.గోపు,
నృత్యం-ఎ.కె.చోప్రా.
తారాగణం : నట రత్న పద్మశ్రీ ఎన్ టి రామారావు బి ఏ, రేలంగి, ఎస్ వి ఆర్, రాజనాల, పద్మనాభం, రమణా రెడ్డి, పద్మశ్రీ నాగయ్య, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, మాస్టర్ రాజకుమార్, జమున, గీతాంజాలి, సూర్యాకాంతం, విజయ లక్ష్మి, పుష్పలత తదితరులు.

మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) , కొడుకు రాము (మాస్టర్ రాజ్కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు.
రాజు యుద్ధరంగం నున్డి ఎంతో సంతోషంగా భార్యా బిడ్డలని కలుసుకోవాలని వస్తాడు. రైలులో తోటి జవాన్లతో ఉత్తరం రాయకుండా తనవారికి సర్ప్రైజ్ ఇస్తున్నానని ఆనందం గా చెబుతాడు. ఊరికి పడవలో వస్తూ ఇంకా కొంత దూరం ఉండగానే పడవ దూకి ఒడ్డుకు రావడం, అతని ఆత్రుత తెలుపుతుంది.

ప్రతి రోజూ తండ్రికోసం రాము ఆ ఏటి ఒడ్డున చూస్తూ ఉంటాడు మూగగా. రాజు రావడం ముందుగా వాసనతో తెలుసుకున్న వారి పెంపుడు కుక్క , రాజు రాకని రాముకు తెలపడంవంటి చిన్న చిన్న వివరాలు ఏ సి త్రిలోకచందర్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.
రాజుకు తన భార్య చనిపోయిందని, కొడుకు మూగపోయాడని తెలుస్తుంది. ఆవేదన చెందుతాడు. తల్లి సమాధివద్ద అమ్మా అని పిలు నాయనా అని ఆర్తితో చెబుతాడు కొడుకుతో. రాము ఎంత ప్రయత్నించినా గొంతు పెగలదు.
కొడుకును తీసుకుని, పెంపుడు కుక్క జాకీతో డాక్టరుకు చూపించాలని రాజు పట్నం బయలుదేరతాడు. దారిలో కట్టెలు పడి పోయినదుకు రామును కొట్టిన వ్యక్తికి (రాజనాల)బుద్ధి చెబుతాడు. కాని అతను తలమీద కొట్టినదొంగ దెబ్బకు రాజు రోడ్డుమీద పడిపోతాడు. సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున) ఆ దారిలోనే బండిలో వస్తూ, చూసి తన ఇంటికి తీసుకు వెళ్ళీ డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయిస్తుంది. మూగపోయిన రామును ఆదరిస్తుంది.రాజుపై అనురాగం పెంచుకుంటుంది.
ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.
రాముకు శస్త్ర చికిత్స చేయించడానికి రాజు మద్రాసు వెడతాడు. అక్కడ డబ్బు పోగొట్టుకుని, డాక్టర్ రాముకు మాట రాదని చెబితే నిరాశతో, సముద్రంలో పడి ప్రాణాలు తీసుకోబోతాడు రాము. దూరాన దేవాలయం నున్చి దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు అన్న గీతం విని, రాజు , రాముతో గుడిలోకి వెళతారు. అన్ని దారులూ మూసుకు పోయాకా, రాజు, రాము సీత ఉన్న వూరు చేరతారు.
గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్ చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
హిందీలో కిశోర్ కుమార్ నిర్మించిన దూర్ గగన్ కే చాన్ మే చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అయితే హాస్య నటుడైన కిశోర్ కుమార్ తొలిసారిగా ధరించిన సీరియస్ పాత్ర అది. తెలుగులో తేలిక, బరువు పాత్రలు సునాయాసంగా నటించే ఎన్ టి ఆర్ మహాద్బుతంగా నటించారు.
అలాగే మాస్టర్ రాజకుమార్ రాముగా గొప్పగా నటించాడు. సీతగ జమున, పిచ్చివాడిగా ఎస్ వి ఆర్ తమ నటనతో మెప్పించారు. రేలంగి, రాజనాల, పద్మ నాభం (తండ్రీ కొడుకులు), హాస్యం అందించారు.
ఈ చిత్రంలో లాయర్ గా అల్లురామలింగయ్య, డ్రామా ఆర్టిస్టులుగా మాణిక్యం (సూర్యాకాంతం), రత్నంగా గీతాంజలి, ఆశీర్వాదంగా రమణారెడ్డి, పాడుబడిన తోటలో చెల్లెలి మరణంతో పిచ్చివాడుగా ముద్రపడ్డ వ్యక్తిగా ఎస్.వి.రంగారావు నటించారు.
స్క్రీన్ ప్లే రైటర్గా, దర్శకునిగా ఎక్కువ భాగం తమిళ చిత్రాలకు, కొన్ని హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి, పలు అవార్డులు పొందిన విశిష్ట దర్శకులు ఏ.సి.త్రిలోక్చందర్ రాము, తమిళ, తెలుగు చిత్రాలకు రెండిటికి వీరే దర్శకత్వం వహించటం విశేషం. తెలుగుదనానికి తగ్గట్టుగా అత్యంత సహజంగా సన్నివేశాలు చిత్రీకరించి వన్నె తెచ్చారు.
నరసరాజుగారి మాటలు చిత్రానికి వన్నె తెచ్చాయి. పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందివంటి పదునైన మాటలు ఎన్నో ఈ సినిమాలో.
కథానాయకుడు రాజాగా ఎన్.టి.రామారావు మొదటి భార్య, రాములపై ప్రేమానురాగాలను తరువాత మూగవాడైన కుమారుని పట్ల బాధతో కూడిన ఆప్యాయతను, అసహాయురాలైన యువతి, తన తోటి సిపాయి సింగన్న కూతురు అయిన లక్ష్మికి అండగా నిలవటం, ఆమె తనను ఇష్టపడినా, తన భార్యపైగల ప్రేమతో ఆమెను నిరాకరించటం(చివరకు లక్ష్మి, రాముతోపాటు వారితో చోటు ఇమ్మని కోరటం) కుమారుడికి మాటలు రావని తెలిసి వేదన, డబ్బు పోగొట్టాడని కోపం, సముద్రంలో దూకనున్న కొడుకును కాపాడుకొని, దైవాన్ని వేడుకోవటం, అంతేకాక స్టంట్ మాస్టర్ రూపొందించిన పులితో పోరాటం కొరడాతో, రంగన్నతో కర్రతో ఫైట్, కాగడాలతో ఫైట్ ఎంతో సహజంగా, చురుకుగా ప్రదర్శించటం ప్రశంసనీయమైన నటన చూపారు. రాము చిత్రం లో ఎన్ టి ఆర్ నటన మహోన్నత శిఖరాలను చేరుకుంది. భార్య సమాధి వద్దకు వచ్చి గొంతు మూగపోయిన బిడ్డతో "అమ్మా అని పిలువు బాబూ" అంటూ చేసిన ఆ సీను నటన అనే పదానికే మకుటాయమానంగా నిలిచింది. ఈ దృశ్యానికిప్రేక్షకులు విచలితులు అయిపోయారు. మూగ బిడ్డ రాముతో చివరివరకు సాగిన ప్రస్థానంలో ఎన్ టి ఆర్ నటన అత్యద్భుత రీతిలో సాగింది. మంటలు రేపే నెలరాజ అనే పాటకు ఆయన చూపిన సున్నితమైన హావభావాలు ప్రేక్షకులను మైకంలో పడవేసాయి.
దానికితోడుగా లక్ష్మిగా జమున, తన శాంతియుతమైన యుక్తమైన నటనతో సన్నివేశాలను, ఆర్ద్రతతో హుందాతనంతో, నిండుతనం చేకూర్చారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించగా, ఎస్.వి.రంగారావు, మాస్టర్ రామూ తమ పాత్రలను ఎంతో సహజంగా నటించి మెప్పించారు.
ఏ వి ఎం పతాకం లో ఇంతకుముందు వచ్చిన తెలుగు సినిమాలు సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద చిత్రాల స్తాయిలో ఆంధ్ర ప్రేక్షకులను మెప్పించిన చిత్రం రాము. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. 1968 లో దక్షిణ భారత దేశంలో విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, ఒరియా బాషలలో వచ్చిన సినిమాలలో రజతోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం తెలుగులో వచ్చిన రాము సినిమా మాత్రమే.
బరువైన కధాశం కలిగిన ఈ సినిమాలో రేలంగి, పద్మనాభం, గీతాంజలి, సూర్యాకాంతం అందించిన హాస్యం ప్రేక్షకులకు రిలీఫ్ నిస్తుంది.
విలన్ పాత్ర పోషించిన రాజనాల అభినయంలో హాస్యం మిళితమైనందున మంచి రిలీఫ్ లభించింది.
ఎ వి ఎం ప్రస్థానంలో అతి పెద్ద సంచలనం "రాము". 1968 లో ఈ చిత్రానిదే అగ్రస్థానం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఈ చిత్రం కలుగచేస్తుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 181 రోజులు ప్రదర్శించబడింది. సూపర్ హిట్ ఆఫ్ ది యియర్ గా 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.
మంచి చిత్రాలను ఇష్టపడే వారు ఎప్పుడైనా, ఎన్నిమార్లైనా చూడదగ్గ చిత్రం ఏ వి ఎం వారి "రాము".
పాటలన్నీ ఆణిముత్యాలే.
రాము చిత్రంలోని గీతాలు, చిత్ర ప్రారంభంలో రాము (మాస్టర్ రాజ్ కుమార్) పై చిత్రీకరించిన సుమతి శతకం పద్యం అక్కరకు రాని చుట్టము (గానం- పి.సుశీల)
తొలుత రాము పాడిన గీతం పుష్పలత, ఎన్.టి.ఆర్, మాస్టర్ రాజ్ కుమార్ ల పై ఒకసారి, మరోసారి జమున, ఎన్.టి.ఆర్ రాములపై చిత్రీకరణ ‘పచ్చనిచెట్టూ ఒకటి వెచ్చని చిలకలు రెండు’ (పి.సుశీల, ఆరుద్ర) ‘వలపుల చిలక, పలకని చిలక, చిలకా రాజు మదిలో సుఖమేది’ సన్నివేశానుగుణమైన గీతం, చరణాలలో రావటం విశేషం.

జమునపై చిత్రీకరించిన ‘కలగంటి కలగంటి చరణం’ వెనుక ఎన్.టి.ఆర్.పై ‘మంటలురేపే నెలరాజా’ వెన్నెలలో ఎంతో ఆర్ద్రత, వేదన నిండిన గీతం (పి.సుశీల, ఘంటసాల, దాశరథి) ఎన్.టి.ఆర్. అభినయం ప్రాణంపోసింది.

గీతాంజలి, సూర్యాకాంతం, రమణారెడ్డి, పద్మనాభంలపై చిత్రీకరించిన ‘తారాశశాంకం’ నాటకం (ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పిఠాపురం, ఎం.ఆర్.తిలకం- రచన కొసరాజు)

జమున, మాస్టర్ రాజ్ కుమార్, ఎన్.టి.ఆర్లపై చిత్రీకరించిన మరో గీతం జమున హుషారుగా, ఎన్.టి.ఆర్. నిర్వేదన, రామూ ఆనందం (మామిడికొమ్మా మళ్ళీమళ్ళీ పూయునులే’’- పి.సుశీల- దాశరథి)

రాము చిత్రంలో మరో మధురమైన భక్తిగీతం ఘంటసాలవారు నాగయ్య, ఎన్.టి.ఆర్.ల కిరువురికీ ఒకేసారి ఒక చరణం చివరలో పాడడం విశేషం. ‘రారా కృష్ణయ్య రారాకృష్ణయ్య’ (రచన-దాశరథి- గానం ఘంటసాల బృందం). ఆర్.గోవర్ధనం స్వరాలతో ఈ చిత్ర
గీతాలు అలరించేలా సాగాయి.

రాము, రాజు సముద్రపు ఒడ్డున

ఎన్ టి ఆర్, రాజకుమార్, జమున

‘‘రాము’’ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శింపబడింది. తెలుగు చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నమోదుకావటం ఆనంద దాయకం.

కథానాయకుడు (1969)




కధానాయకుడు (27-02-1969)


1969 లో 52 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 11 సినిమాలలో నటించారు . వర కట్నం, కధా నాయకుడు, భలే మాస్టారు, గండికోట రహస్యం, విచిత్ర కుటుంబం, కదలడు వదలడు, నిండు హృదయాలు, భలే తమ్ముడు , అగ్గి వీరుడు, మాతృదేవత, ఏక వీర.


అక్కినేని నటించిన 8 సినిమాలు అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, భలే రంగడు, బుద్దిమంతుడు, సిపాయి చిన్నయ్య,


ఇతరులు నటించిన 33 సినిమాలు శ్రీ రామ కధ, మంచి మిత్రులు, దేవుడిచ్చిన భరత, లవ్ ఇన్ ఆంధ్రా, సప్త స్వరాలు, భలే అబ్బాయిలు, బంగారు పంజరం, బొమ్మలు చెప్పిన కధ, చిరంజీవి, అర్ధ రాత్రి, మహా బలుడు, శబాష్ సత్యం, ఆస్థులు అంతస్థులు, టక్కరి దొంగ చక్కని చుక్క, ముహూర్త బలం, సత్తెకాలపు సత్తెయ్య, మామకు తగ్గ కోడలు, జరిగిన కధ, జగత్ కిలాడీలు, పంచ కల్యాణి దొంగల రాణి, నాటకాలరాయడు, రాజ సింహ, అన్నదమ్ములు, ప్రేమ కానుక, ఉక్కు పిడుగు, మనుషులు మారాలి, ధర్మ పత్ని, కన్నుల పండగ, తారా శశాంకం, కర్పూర హారతి, ప్రతీకారం, గండర గండడు, బంధిపోటు భీమన్న 1969 లో విడుదలయ్యాయి.


రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' (27-02-1969) సూపర్ హిట్ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కధానాయకుడు సినిమా 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రజతోత్సవం కూడా జరుపుకుంది. నిర్మాతలకు ఒక రూపాయ పెట్టుబడికి 9 రూపాయల లాభం తెచ్చిమిది. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.


వర కట్నం (10-01-1969) , విచిత్ర కుటుంబం (28-05-1969) , నిండు హృదయాలు (15-08-1969) , మాతృదేవత (07-11-1969) , అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.


"గండికోట రహస్యం (01-05-1969) , మహ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు' (18-09-1969), జగత్ కిలాడీలు, మహాబలుడు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.


విశ్వనాధ సత్యనారాయణ గారి నవల ఏకవీర (04-12-1969) మ్యూజికల్ హిట్ గా నిలచింది. భలే మాస్టారు (27-03-1969), కదలడు వదలడు (09-07-1969), అగ్గి వీరుడు (17-10-1969), ఆదర్శ కుటుంబం, భలే రంగడు, సిపాయి చిన్నయ్య, నిరాశ పరిచాయి.

జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.


27-02-1969 న విడుదలైన కధానాయకుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా విశేషాలు:-


పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు. 23 ఆగస్టు, 1978లో గోపాలకృష్ణ పరమపదించారు. ‘కథానాయకుడు’ చిత్రంతో ‘బంగారు నంది పురస్కారం’ పొందిన నిర్మాత కావటం విశేషం. వీరి అల్లుడు వి బాలకృష్ణరావు ‘ఉషా పిక్చర్స్’ ద్వారా ప్రముఖ చిత్ర పంపిణీదారుగా ఖ్యాతి గడిస్తున్నారు. 27 ఫిబ్రవరి 1969న కథానాయకుడు చిత్రం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె ప్రత్యగాత్మ సోదరుడైన ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధరరావు కథానాయకుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.


కథ: ముళ్ళపూడి వెంకటరమణ

మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ

సంగీతం: టివి రాజు

కళ: బిఎస్ కృష్ణ

నృత్యం: తంగప్ప

స్టంట్స్: శ్యామ్సుందర్

కెమెరా: విఎస్ఆర్ స్వామి

నిర్మాత: కె గోపాలకృష్ణ

దర్శకత్వం: హేమాంబరధరరావు


సినిమా ఆరంభంలో ఒక చిన్న టౌన్ లో ప్రజలు కొంతమంది స్వార్ధపరులైన పెద్దమనుషుల చేతిలో ఎలా దోపిడీ కి గురి కాబడుతున్నారో చూపిస్తారు. ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరావు), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు.


దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (ఎన్ టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.


కధానాయకుడు సారధిగా ఎన్ టి ఆర్ , కధానాయకి జయగా జయలలిత ఎంతో విశిష్టంగా నటించారు. వీరిద్దరూ అద్భుత నటనా ప్రావీణ్యంతో తాము ఉన్న ప్రతి సన్నివేశానికి వన్నె చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.


దయానందంగా నాగభూషణం, సత్య మూర్తిగా మిక్కిలినేని, అప్పడు దొరగా అల్లు రామలింగయ్య చక్కగా నటించారు.


చిత్రంలో సారథి స్నేహితుడు సింహగా పద్మనాభం, అతని భార్య రమగా రమాప్రభ, ఆమె తల్లిదండ్రులుగా రాధాకుమారి, రావి కొండలరావు, పక్కింటి ఇల్లరికపు అల్లుడు పులి రాజుగా రాజ్బాబు, సుందరిగా పద్మ లక్ష్మి, సుందరి తల్లిగా జూనియర్ భానుమతి సమకూర్చిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.


చలపతి మాస్టారుగా నాగయ్య, సారధి అన్న శ్రీనివాసరావుగా ధూళిపాళ, కాకారావుగా కాకరాల, జయ అన్నగా ప్రభాకర రెడ్డి, అతని స్నేహితుడిగా ఆదుర్తి నరసిం హ మూర్తి, కోటీశ్వరుడిగా ముక్కామల, సారధి వదినగా టి జి కమలా దేవి, ఆమె పిల్లలుగా బేబీ పద్మిని, బేబీ మల్లిక , మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగిగా చలపతిరావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.


యువ దర్శకుడు శ్రీ కె హేమాంబరధర రావు ఈ చిత్రంతో అగ్ర శ్రేణి దర్శకుల జాబితాలో చేరారు. సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా, పట్టుతో అర్ధవంతంగా రూపొందించి కథను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత దయానందం, తరువాత సత్యమూర్తి, అప్పడు వరుసగా తమ చేతికర్రలతో ధర్మారావు వద్దకు వచ్చి, అతని మెడకు కర్రలతో బంధం వేసి అంతం చేయటం, బ్యాక్గ్రౌండ్లో సంఘంలో న్యాయం, ధర్మం, నీతి లక్షణాలను లెక్కచేయని వారి గురించి చెప్పించటం ఆసక్తికరం అనిపిస్తుంది. తిరిగి కైమాక్స్లో సారథిని అదేవిధంగా అంతం చేయాలని ముగ్గురూ కర్రలు బిగించగా, హీరో వాటిని ఛేదించి ముక్కలు చేసే సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.


ఇక ఈ ముగ్గురు దుర్మార్గులున్న ఇంటి మెట్లమీది సన్నివేశంలో.. 10నెలల జీతం కోసం ఉపాధ్యాయుడు చలపతి దీనంగా అర్థిస్తూ ‘ఆకలితో మావాళ్లు అలమటిస్తున్నారని చెప్పే సందర్భంలో -అల్లు రామలింగయ్య (మంచింగ్) తినటం, గొంతులార్చుకుపోతున్నాయనగా మిక్కిలినేని మందు తాగడం, మెట్లకింద వున్న నాగయ్యను గెంటి వేయించటం, వారు రోడ్డుమీద ఆకలితో నీరసంతో తూలటం, మరోచోట నాగభూషణం మందు తాగిన మత్తుతో తూలటం సమాంతరంగా చూపి విశ్లేషించటం దర్శకుని ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.


హాస్పిటల్లో డాక్టరు స్టాకులేదని మందివ్వక అతని మరణానికి కారణం కావటం, ఆ మెట్లముందు సారధి వార్నింగ్ ఒకసారి, మరోసారి చైర్మెన్ పదవి పోయిన సారథిని మెట్లమీంచి దిగుతూ దుర్మార్గ బృందం అతనిపై విస్కీ పోయటం, హేళన చేసి కొట్టిపడవేయటం వంటి సన్నివేశాలు కథలో పట్టును పెంచాయి.


మార్పు స్వభావం తెలిసిన శ్రీనివాసరావు జనతా స్కీమ్ క్రింద పేదవారివద్ద వసూలు చేసిన సొమ్ము దాచటం, అతన్ని బంధించి ఈ దుష్టులు హింసించటం, క్లైమాక్స్లో డబ్బుకోసం త్రవ్వకంలో మిక్కిలినేని, అల్లు రామలింగయ్యకు పాము, గబ్బిలాలు, తేళ్లు రావటం, అక్కడ దుష్టులతో హీరో పోరాటం ఎంతో ఉత్సుకత, సాహసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. నీతి, నిజాయితీ లక్షణాలు సామాన్యుల్లోనూ ఉంటాయని జయ పాత్ర ద్వారా చెబితే, తాగుబోతు నాగులు కూడా చెల్లెలికోసం మారటం ద్వారా మరింత బలంగా చూపించటం ఎన్నదగిన అంశం.


ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ సమకూర్చిన కధలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సంఘటనలు, పాత్రపోషణ సహజత్వానికి దగ్గరగా నిర్ధుష్టంగా ఉంటాయి.


శ్రీ భమిడిపాటి రాధా కృష్ణ సంభాషణలు ఎంతో భావస్పూర్తితో వెల్లివిరుస్తూ చిత్రానికి నిండుతనాన్ని తెచ్చాయి.


లోగడ ‘పెద్దమనుషులు’, ‘దేశద్రోహులు’ వంటి పలు చిత్రాల్లోని అంశాలకు మరింత రంజుగా కథను సమకూర్చుకొని ముళ్ళపూడివారు, దానికి తగ్గ నిత్యసత్యాల్లాంటి సంభాషణల్ని (విలన్లు సారథితో- మాలాంటి వాళ్లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు, వుంటారు. నీలాంటివాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. మీవల్ల దేశంలో, మనుషుల్లో మార్పు రాదు) సమకూర్చి భమిడిపాటి రాధాకృష్ణ, దర్శకుల రూపకల్పనకు జోడిగా మహానటుడు యన్టిఆర్ సన్నివేశాలకు తగిన సంయమనంతో కూడిన ముచ్చటైన అభినయం, తోటి నటీనటుల సహకారం చిత్రాన్ని విజయపథంవైపు నడిపించింది.


చిత్రంలో హీరో హీరోయిన్లపై ఒక్కటైనా యుగళగీతం, కనీసం కలలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క యుగళ గీతమైనా ఉంటే బావుంటుందేమోనని హీరో యన్టిఆర్ సూచించినపుడు, ఈ కథకు అది నప్పదు అని దర్శకులు హేమాంబరధరరావు చెప్పారు. దానిని ఎన్ టి ఆర్ ఎంతో హృద్యంగా అంగీకరించటం గొప్ప విశేషం.


అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించటం కోసం విజయావారు, ఏవిఎం వారు, ఎంజి రామచంద్రన్ కోరటం, దానికి ఎన్ టి ఆర్ ఆ వ్యవహారాలన్నీ దర్శకులు, నిర్మాతల అభిష్టానికే వదిలివేయటం జరిగింది.


శ్రీ వి ఎస్ ఆర్ స్వామి కెమెరా, బి ఎన్ కృష్ణ కళ, తంగప్ప నృత్యాలు, వాసు ఎడిటింగ్ చిత్రానికి ఒక సముచిత స్థాయిని చేకూర్చాయి.

ఇంతేనయా తెలుసుకోవయ్యా పాటలో వి ఎస్ ఆర్ స్వామి కెమెరా ప్రతిభ గూర్చి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.


చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే గోరంత దీపం వెలిగించినవాడే ఉత్తముడు. సంఘంలోని వివిధ రంగాల్లో విశృంఖల విహారం చేస్తున్న అవినీతిని, మోసాన్ని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే వాటిని ఎదుర్కోవడానికి చేసిన ఏ చిన్న ప్రయత్నం జరిగినా హర్షించదగినదే. సమాజంలోని దుష్ట శక్తులను నిర్మూలించి మనిషి మనుగడను సార్ధకం చేయడానికి ప్రతి ఒక్కచోటా ఒక కధానాయకుడు ఉద్భవించాలి అని చాటి చెప్పే గొప్ప సాంఘిక చిత్రం గోపాల కృష్ణ ప్రొడక్షన్స్ వారి "కధా నాయకుడు".


ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించగల ఇంత చక్కని చిత్రాన్ని నిర్మించిన కె గోపాల కృష్ణ ఎంతో అభివందనీయులు. ఉత్తమ అభిరుచులు, ఉన్నతమైన ఆశయాలు గల ఈ యువ నిర్మాత అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందారు.


కధానాయకుడు సినిమా రాజకీయ ట్రెండ్ సెట్టర్ గా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో సంచలనాలు సృష్టించి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. 1969 లో సూపర్ డూపర్ హిట్ గా ఆ సంవత్సరానికి నెంబర్ వన్ గా నిలచింది. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపమైన సారధి పాత్రలో ఎన్ టి ఆర్ నటన ఎవ్వరూ అందుకోలేని అందలాలకు చేరుకుంది. సన్నివేశపరంగా ఈ చిత్రాన్ని వర్ణించడం అసాధ్యం. యూ ట్యూబ్ లో కాకుండా మంచి ప్రింట్ లో చూడవలసిన సినిమా. ఈ టీ వీ సినిమాలో అప్పుడప్పుడు వేస్తుంటారు.


శ్రీ దాశరధి 3 పాటలు, శ్రీ కొసరాజు 4 పాటలూ రాశారు. పాటలు అన్నీ ఆకర్షణీయంగా వుంటాయి. శ్రీ టీ వీ రాజు కూర్చిన సంగీతం చిత్రానికి గొప్ప ఆకర్షణ అని చెప్పవచ్చు.


హీరో లక్షణాలను, కథను విశ్లేషిస్తూ ఆకట్టుకునేలా వాద్యంతో, బృంద నృత్యంతో, ఎన్ టి ఆర్- జయలలితలపై చిత్రీకరించిన గీతం -వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్య’ (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: కొసరాజు).


https://www.youtube.com/watch?v=t9gnfp5fdxs

జయలలితపై చిత్రీకరించిన గీతం , పళ్ళండి పళ్ళండి పళ్ళు, జామ పళ్ళు, కొసరాజు, ఎల్ ఆర్ ఈశ్వరి

https://www.youtube.com/watch?v=GnqDyspt4v0 

అద్దంలో హీరో తాను వలచిన అమ్మాయిగా జయను చూపించగా ఆనందంతో జయలలితచే నృత్య గీతం -ముత్యాల జల్లుకురిసే రతనాల’ (దాశరథి, సుశీల ). ఈ చిత్రంలో హిట్ సాంగ్లో ఒకటిగా ఇది నిలిచింది.

https://www.youtube.com/watch?v=jonlDR4dDwE 

మంచివాడు మా బాబాయి, దాశరధి, సుశీల, బెంగలూరు లత


https://www.youtube.com/watch?v=6WuIkIdcv8g

ఎన్ టి రామారావు, జయలలిత నృత్య కళాకారులతో నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ముక్కామల హావభావాలను చూపుతూ చిత్రీకరించిన (ప్రత్యేకించి రంగుల్లో) గీతం -ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం’ (గానం: ఘంటసాల బృందం, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=FDPjX0u75Gs

రాజ బాబు , పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం -రావేలా దయరాదా రావా ఇంటికి (గానం: పిఠాపురం, మాధవపెద్ది, రచన: దాశరథి). ఈ చిత్రంలోని మరో హిట్సాంగ్.


https://www.youtube.com/watch?v=Zcur0kv8vIM

జయలలిత, నాగభూషణంలపై ఇంట్లో ఆరుబయట వెన్నెల్లో చిత్రీకరిస్తే, జయలలిత రకరకాల స్టెప్స్, అలరించే నృత్యంతో వెరైటీగా సాగే గీతం -వయసు మళ్లిన బుల్లోడా (గానం: పి సుశీల, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=jqsTZuvnIqY

‘కథానాయకుడు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1969 సంవత్సరానికి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ పురస్కారంతో సత్కరించింది.

ఆడ బ్రతుకు(1965)




 🌹🌹ముక్కో‌ణపు ప్రేమ‌కథ ఆడబ్రతుకు🌹🌹

చల‌న‌చిత్ర చరి‌త్రలోనే అపూర్వ కళా‌ఖం‌డంగా నిలి‌చి‌పో‌యిన ‌‘చంద్రలేఖ’‌ హిందీ సినిమా ద్వారా అద్భుత సంచ‌లనం సృష్టిం‌చిన చిత్ర నిర్మాణ సంస్థ ‌‘జెమినీ’‌.‌ ఆ చిత్రంలో కథా‌నా‌యి‌కగా నటిం‌చిన టి.‌ఆర్‌.‌రాజ‌కు‌మారి ఆనాటి ప్రేక్ష‌కు‌లకు వెండి‌తె‌రపై సాక్షా‌త్క‌రిం‌చిన స్వప్న‌సుం‌ద‌రిగా నిలి‌చింది.‌ జెమినీ స్టూడి‌యోతో బాటు జెమినీ వారి సిని‌మాలు కూడా అగ్రశ్రే‌ణిలో వెలు‌గొం‌దు‌తున్న రోజుల్లో వేదాంతం రాఘ‌వయ్య దర్శ‌క‌త్వంలో జెమినీ అధి‌పతి యస్‌.‌యస్‌.‌వాసన్‌ నిర్మిం‌చిన ప్రేమ కావ్యం ‌‘ఆడ‌బ్రతుకు’‌ సినిమా.‌ ఆత్రేయ, సినా‌రెల పా(మా)ట విరు‌పు‌లకు సుస్వర రాగా‌ల‌ల్లిన స్వర‌మా‌ధురీ ధురీ‌ణులు విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూ‌ర్తిల గాన కావ్యం ఈ సినిమా.‌ ఎన్టీ‌ఆర్‌ చల‌న‌చిత్ర జీవి‌తంలో ‌‘ఆడ‌బ్రతుకు’‌ విజయం ఒక గొప్ప రజ‌తో‌త్సవ మైలు‌రాయి.‌ నవం‌బరు 11, 1965న విడు‌ద‌లైన ఈ సినిమా విశే‌షాలు కొన్ని.‌.‌.

సినిమా కథ ..

సీత (దేవిక) కలిగిన కుటుం‌బంలో పుట్టినా, అనుకోని పేద‌రికం వలన ఒక నాటక కంపె‌నీలో చేరు‌తుంది.‌ ఆ కంపెనీ డైరె‌క్టరు గోపా‌ల‌రావు (కాంతా‌రావు) సీతకు మంచి అవ‌కా‌శాలు ఇవ్వ‌డమే కాకుండా ఆమెను మన‌సారా ప్రేమి‌స్తాడు, అభి‌మా‌ని‌స్తాడు.‌ కానీ, సీతకు అతడు తనను ప్రేమి‌స్తు‌న్నట్టు తెలి‌యదు.‌ ఆ కంపెనీ యజ‌మాని గంగ‌రాజు (రాజ‌నాల) సీతపై కన్ను‌వే‌స్తాడు.‌ ఒక‌రోజు గంగ‌రాజు రౌడీలు సీతను బల‌వం‌తంగా అతని వద్దకు తీసు‌కొని వెళ్తుం‌డగా రావు‌బ‌హ‌ద్దూర్‌ రంగ‌నాథం (యస్వీ రంగా‌రావు) కొడుకు రాజా (ఎన్టీ‌ఆర్‌) ఆమెను కాపా‌డు‌తాడు.‌ మన‌సులు కలిసి ఇద్దరూ ప్రేమిం‌చు‌కుం‌టారు.‌ రాజా సీతను పెళ్లి‌చే‌సు‌కుం‌టా‌నని తండ్రితో చెప్ప‌డంతో అతడు హతా‌శు‌డ‌వు‌తాడు.‌ నాట‌కాల కంపె‌నీలో నర్తించే అమ్మా‌యిని కోడ‌లిగా పొందడం రంగ‌నా‌థా‌నికి ఇష్టం ఉండదు.‌ రాజు తన నిర్ణ‌యాన్ని మార్చు‌కో‌క‌పో‌వ‌డంతో విధి‌లేని పరి‌స్థి‌తుల్లో వారి‌ద్ద‌రికీ పెళ్లి జరి‌పి‌స్తాడు.‌ గోపా‌ల‌రా‌వును చూడ‌రా‌దని, కలు‌సు‌కో‌రా‌దని సీతకు షరతు విధి‌స్తాడు.‌ ఒక‌రోజు రాత్రి రాజు−‌సీత ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుం‌డగా గంగ‌రాజు వద్ద వుండే రౌడీ జోగులు (సత్య‌నా‌రా‌యణ) వల‌పన్ని ఇద్ద‌రినీ వేరు‌చే‌స్తాడు.‌ ఒంట‌రిగా చిక్కిన సీతను వెంబ‌డి‌స్తాడు.‌ అతని బారి నుండి రక్షిం‌చు‌కో‌డా‌నికి సీత ఒక‌రింట్లో దాక్కుం‌టుంది.‌ ఆ ఇల్లు గోపా‌ల‌రా‌వుది.‌ ఆ సమ‌యంలో విప్ల‌వ‌కా‌రులు చెల‌రేగి దోపి‌డీలు, లూఠీలు చేస్తుం‌డ‌టంతో పోలీ‌సులు ఆ ప్రదే‌శంలో కర్ఫూ¬్య విధి‌స్తారు.‌ సీత ఆ రాత్రి గోపా‌ల‌రావు ఇంట్లో తల‌దా‌చు‌కో‌వ‌లసి వస్తుంది.‌ అదే‌రాత్రి గంగ‌రా‌జును జోగులు హత్య చేస్తాడు.‌ మరు‌నాటి ఉదయం పోలీ‌సులు అను‌మా‌నంపై గోపా‌ల‌రా‌వును అదు‌పు‌లోకి తీసు‌కుం‌టారు.‌ సీత సాక్ష్యం మీద తన నిర్దో‌షిత్వం నిరూ‌పిం‌చు‌కొనే అవ‌కాశం గోపా‌ల‌రా‌వుకు ఉంటుంది.‌ కానీ, ఏ పాపమూ ఎరు‌గని సీత బతుకు చీక‌టై‌పో‌తుం‌దని ఆ విష‌యాన్ని గోపా‌ల‌రావు బయ‌ట‌పె‌ట్టడు.‌ కానీ తన సాక్ష్యంతో ఒక నిర‌ప‌రా‌ధికి ఉరి శిక్ష తప్పు‌తుం‌దని తెలు‌సు‌కున్న సీత, కోర్టులో సాక్ష్యం చెప్పి గోపా‌ల‌రావు విడు‌ద‌లకు సహ‌క‌రి‌స్తుంది.‌ దాంతో రాజా ఆమెను ఇంటి నుంచి గెంటి వేస్తాడు.‌ అప్పుడు సీత గర్భ‌వతి.‌ తల్లితో కలిసి ఊరు విడిచి వెళుతూ మైకం కమ్మి పడి‌పోతే, పొరు‌గూ‌రులో ఉండే భాగ్య‌వం‌తు‌డైన షేర్‌ఖాన్‌ (ముక్కా‌మల) ఆమెను ఆశ్రయ‌మి‌స్తాడు.‌ అతడు రంగ‌నా‌థా‌నికి మిత్రుడు.‌ సీత మగ‌బి‌డ్డను ప్రస‌వి‌స్తుంది.‌ తండ్రి మనో‌వే‌దన చూసి భరిం‌చ‌లేక రాజా మరో‌పె‌ళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు.‌ విషయం తెలు‌సు‌కున్న షేర్‌ఖాన్‌ పెళ్లి ఆపేం‌దుకు కారులో రంగ‌నాథం ఊరికి వెళు‌తుం‌డగా పోలీ‌సు‌లతో పాటు గోపా‌ల‌రావు కూడా జోగు‌లను తరు‌ము‌కుంటూ షేర్‌ఖా‌న్‌కు ఎదు‌ర‌వు‌తారు.‌ పోలీ‌సుల కాల్పుల్లో జోగులు మర‌ణిస్తూ సీత నిర్దో‌షి‌త్వాన్ని వెల్ల‌డి‌స్తాడు.‌ సీతను వెది‌కేం‌దుకు వెళ్లిన రాజా భూకం‌పంలో చిక్కు‌కోగా తన పెంపుడు కుక్క రాజాను రక్షి‌స్తుంది.‌ చివ‌రికి అంతా కలు‌సు‌కో‌వ‌డంతో సినిమా ముగు‌స్తుంది.‌ ఈ సిని‌మాలో సహాయ పాత్రల్లో ఋష్యేం‌ద్రమణి, యం.‌వి.‌రాజమ్మ, పుష్ప‌వల్లి, గీతాం‌జలి, పద్మ‌నాభం, మహం‌కాళి వెంకయ్య, అల్లు రామ‌లిం‌గయ్య, బేబీ ఫరీదా నటిం‌చారు.‌

విశ్వ‌నాథ సమ్మో‌హనం..

ఈ సిని‌మాకు విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూర్తి సంగీతం అందిం‌చారు.‌ పేరు ఇద్ద‌రిదే అయినా స్వర రచ‌నలో మాత్రం విశ్వ‌నా‌థ‌న్‌దే ప్రధాన భూమిక.‌ ఆయన హార్మో‌నియం మీద పాటను కంపోజ్‌ చేస్తుంటే రామ్మూర్తి ఫిడే‌లుతో విశ్వ‌నా‌థ‌న్‌కు సరి జో(తో)డుగా ఉండే‌వారు.‌ తెలుగు, తమిళ వర్ష‌న్లలో కొన్ని పాట‌లకు రెండు వైవి‌ధ్య‌మైన ట్యూనులు సమ‌కూ‌ర్చడం కూడా విశ్వ‌నా‌థన్‌ ప్రత్యే‌కత.‌ ఈ సిని‌మాలో తమి‌ళం‌తో‌పాటు ఎన్టీ‌ఆర్‌కు కూడా అన్ని‌పా‌టలూ పి.‌బి.‌శ్రీని‌వాసే పాడారు.‌ శ్రీని‌వాస్‌ పాడిన ‌‘కనులు పల‌క‌రిం‌చెను పెద‌వులు పుల‌క‌రిం‌చెను బుగ్గ‌లపై లేత‌లేత సిగ్గులు చిగు‌రిం‌చెను’‌ పాటను శంక‌రా‌భ‌రణ రాగంలో స్వర‌ప‌రి‌చారు.‌ పాట చిత్రీ‌క‌రణ కర్ణా‌ట‌క‌లోని హొగే‌ని‌కల్‌ జల‌పాతం వద్ద జరి‌గింది.‌ అందుకు అను‌గు‌ణంగా సినారె ‌‘అంద‌మైన ఆ జల‌పాతం ఆల‌పించె తీయని రాగం.‌.‌ కని‌పిం‌చని నీ హృద‌యంలో విని‌పిం‌చెను నా సంగీతం’‌ అంటూ రాశారు.‌ అభేరి రాగంలో విని‌పించే ‌‘పిలిచే నా మదిలో వలపే నీదే సుమా.‌.‌ రారాజు ఎవ‌రైనా నారాజు నీవే సుమా’‌ పాట అటు హ్యాపీగా ఇటు పాథో‌స్‌గా వస్తుంది.‌ ఈ పాటలో దేవిక ‌‘అనా‌ర్కలి’‌గా చక్కగా నర్తించి నటిం‌చింది.‌ ప్రేమను ఏ విఘా‌తాలు ఆప‌లే‌వని అర్థం వచ్చేలా ‌‘చుక్కలే తెగి‌పోనీ సూర్యుడే దిగిô‌¦నీ.‌.‌ ఈ ప్రేమ మార‌దులే ఈ జ్యోతి ఆర‌దులే.‌.‌ ఎన్ని జన్మ‌ల‌కైనా ఈ బంధ‌ముం‌డు‌నులే’‌ అంటూ ముక్తా‌యిం‌చారు.‌ ఇక అందరూ మెచ్చే గీతం ఆత్రేయ రాయగా శ్రీని‌వాస్‌ అద్భు‌తంగా పాడిన ‌‘బుజ్జి‌బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ.‌.‌ నీ బోసి నవ్వు‌లలో పూచే పున్నమి వెన్నె‌ల‌లోనే’‌ పాట.‌ తెలుగు, తమి‌ళంలో కూడా ఈ పాటకు ఒకటే ట్యూను.‌ ‌‘పూవంటి మన‌సులో ముళ్లున్న జగ‌తిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతు‌కురా.‌.‌ నమ్ము‌కున్న నావాళ్లు నాకిదే నేర్పారూ, పాపా‌యిగా ఉంటే బాధలే ఉండ‌వురా’‌ వంటి మాటలు ఆత్రేయ ముద్రను గుర్తు‌చే‌స్తాయి.‌ సినిమా మొద‌ట్లోనే వచ్చే సినారె గీతం ‌‘ఆహా అందము చిందే హృద‌య‌క‌మలం అందు‌కొనే రాజొ‌కడే.‌.‌ వేల తార‌కల బృంద‌ము‌లోనా వెలిగే చందు‌రు‌డొ‌కడే’‌ కేవలం ఒక నాట్య‌గీ‌తమే కాకుండా హీరో‌పట్ల హీరో‌యిన్‌ తన ప్రేమను సూచన ప్రాయంగా వ్యక్త‌ప‌రిచే సంద‌ర్భో‌చిత ప్రణయ గీతం కూడా.‌ ఆత్రేయ రాసిన మనసు పాట ‌‘తను‌వు‌కెన్ని గాయా‌లైనా మాసి‌పో‌వు‌నే‌లా‌గైనా.‌.‌ మనసు కొక్క గాయ‌మైనా మాసి‌పోదు చితి‌లో‌నైనా’‌ను విశ్వ‌నా‌థన్‌ శోక‌ర‌సా‌నికి ప్రతీ‌కైన శుభా‌పం‌తు‌వళి రాగంలో మట్లు కట్టారు.‌ ‌‘ఆడ‌వాళ్లు ఆడు‌కునే ఆట‌బొమ్మ ఈ మగ‌వాడూ.‌.‌ ఆడు‌కున్న పర‌వా‌లేదూ పగు‌ల‌గొట్టి పోతా‌రెం‌దుకు’‌ అని రాసిన ఆత్రే‌యకు మాత్రమే అలతి అలతి పదా‌లతో అనం‌తా‌ర్థాన్ని చూప‌గల సత్తా ఉంద‌ని‌పి‌స్తుంది.‌ సుశీల పాడిన ‌‘నిత్య సుమం‌గళి నీవమ్మా నీకు అమం‌గ‌ళ‌మే‌దమ్మా.‌.‌ ప్రేమకు మృత్యువు లేదమ్మా పెట్టి‌న‌బొట్టూ పోదమ్మా’‌ పాట దేవి‌కను రాజా బహి‌ష్క‌రించి వెలు‌ప‌లకు పంపిం‌చి‌న‌ప్పుడు వస్తుంది.‌ ఇది కూడా ఆత్రేయ రచనే.‌ ఇక సినారె కలం పండిం‌చిన ‌‘వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడూ.‌.‌ తెస్తాడే తెస్తాడే తేనె‌జ‌ల్లులూ’, ‌‘కాలి‌ము‌వ్వలు ఘల్లు‌ఘ‌ల్లు‌మనె ఎందుకో’, ‌‘ఓర‌చూ‌పులో ఏముందో దోర‌న‌వ్వులో ఏముందో’‌ పాటలు కూడా ఆక‌ట్టు‌కు‌నేవే.‌ ప్రేమా‌ను‌రా‌గా‌లతో నిండిన ఒక ఆద‌ర్శ‌వం‌త‌మైన సిని‌మాగా పేరు‌తె‌చ్చు‌కున్న సినిమా ‌‘ఆడ‌బ్రతుకు’‌.‌

సినిమా నేపథ్యం.‌.‌.

జెమినీ చిత్రని‌ర్మాణ సంస్థకు ఘన‌మైన చరిత్ర ఉంది.‌ ఆ సంస్థ అధి‌పతి సుబ్రమ‌ణియం శ్రీని‌వా‌సన్‌ (యస్‌.‌యస్‌.‌వాసన్‌)కు అంత‌కంటే ఘన‌చ‌రిత్రే ఉంది.‌ తండ్రి మర‌ణిం‌చాక తంజా‌వూరు జిల్లా నుంచి మద్రా‌సుకు చేరు‌కొని, చదు‌వుకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలో అడుగు పెట్టాడు.‌ 1928లో మూత‌ప‌డిన ‌‘ఆనంద బోధిని’‌ అనే పత్రి‌కను సొంతం చేసు‌కొని ‌‘ఆనంద విక‌టన్‌’‌/ళి పే‌రుతో ఆ పత్రి‌కకు ఎన‌లేని కీర్తిని సంపా‌దించి పెట్టారు.‌ 88 ఏళ్లుగా ఆ పత్రిక గౌర‌వ‌ప్రదంగా నడు‌స్తోంది.‌ 1936లో చిత్రని‌ర్మాణ రంగంలో అడు‌గు‌పెట్టి తొలి ప్రయ‌త్నంగా సొంత నవల ‌‘సతి‌లీ‌లా‌వతి’‌ని సిని‌మాగా మలి‌చారు.‌ తర్వాత ‌‘మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూ‌సర్‌ కంబైన్స్‌’‌ అనే ఫిలిం స్టూడి‌యోను కొను‌గోలు చేసి దానికి ‌‘జెమిని’‌ అని నామ‌క‌రణం చేశారు.‌ ఈ సంస్థ ద్వారా పలు తమిళ, తెలుగు, హిందీ సిని‌మా‌లను నిర్మించి ఖ్యాతి గడిం‌చారు.‌ జెమినీ ఫిలిం సర్కూ‌¬్యట్‌ వారు తెలు‌గులో నిర్మిం‌చిన మొదటి చిత్రం ‌‘జీవ‌న్ముక్తి’‌ (1942).‌ తరు‌వాత తెలు‌గులో వరు‌సగా ‌‘బాల‌నా‌గమ్మ’, ‌‘అపూర్వ సహో‌ద‌రులు’, ‌‘మంగళ’, ‌‘ముగ్గురు కొడు‌కులు’, ‌‘చిన్న‌మ్మ‌కథ’, ‌‘రాజీ నా ప్రాణం’‌ వంటి సిని‌మాలు ఎన్నో నిర్మిం‌చారు.‌ చిత్రరం‌గా‌నికి ‌‘పరి‌శ్రమ’‌ గుర్తింపు తెచ్చిన తొలి రాజ్య‌సభ సభ్యు‌డిగా వాస‌న్‌కు పేరుంది.‌ జెమినీ స్టూడి‌యోలో వేప‌త్తూర్‌ కిట్టు అనే తమిళ జర్న‌లిస్టు వారి సిని‌మా‌లకు స్క్రీన్‌ప్లే సమ‌కూ‌రుస్తూ ఉండే‌వాడు.‌ అతడు వాస‌న్‌కు అత్యంత సన్ని‌హి‌తుడు.‌ జెమినీ సిని‌మా‌లకు దర్శ‌కత్వం వహించే టి.‌జి.‌రాఘ‌వా‌చారి (ఆచార్య) కూడా అత‌నికి మిత్రుడే.‌ ‌‘చంద్రలేఖ’, ‌‘మోటార్‌ సుందరం పిళ్లై’‌ వంటి సిని‌మా‌లకు అతడే కథా రచ‌యిత.‌ అతడు ఇంగ్లిషు నవ‌లలు ఎక్కు‌వగా చది‌వే‌వాడు.‌ ఒక‌సారి ఇంగ్లిషు‌లోకి అను‌వ‌దిం‌చిన ఒక ఫ్రెంచ్‌ నవ‌లను చదివి కథ అల్లాడు.‌ ఆ కథనే హిందీలో ‌‘జిందగీ’‌ పేరుతో తొలుత సిని‌మాగా తీశారు.‌ 1964లో విడు‌ద‌లైన ఆ సిని‌మాకు రామా‌నం‌ద‌సా‌గర్‌ దర్శ‌కత్వం వహి‌చంగా, శంకర్‌−‌ జైకి‌షన్‌ సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ రాజేం‌ద్రకు‌మార్, రాజ్‌కు‌మార్, పృథ్వీ‌రా‌జ్‌Ë‌క‌పూర్, వైజ‌యం‌తి‌మాల ప్రధాన భూమి‌కలు నిర్వ‌హిం‌చారు.‌ ఆ సినిమా విజ‌య‌వం‌తంగా ఆడింది.‌ అదే సిని‌మాని తెలుగు తమిళ భాషల్లో ఏక‌కా‌లంలో నిర్మిం‌చా‌లని వాసన్‌ నిర్ణ‌యించి వేప‌త్తూర్‌ కిట్టు చేత కథను ప్రాంతీయ భాషకు అను‌గు‌ణంగా అల్లిం‌చారు.‌ అదే తెలు‌గులో ‌‘ఆడ‌బ్రతుకు’‌గా, తమి‌ళంలో ‌‘మళఘై పడుగు’‌గా రూపు‌ది‌ద్దు‌కుంది.‌ తెలు‌గులో ఎన్టీ‌ఆర్, కాంతా‌రావు పాత్రల్ని తమి‌ళంలో జెమినీ గణేష్, ముత్తు‌రా‌మన్‌ పోషిం‌చగా, యస్వీ‌రం‌గా‌రావు, దేవిక తమ పాత్రల్ని రెండు భాష‌ల్లోను పోషిం‌చారు.‌ ‌‘దేవ‌దాసు’‌ వంటి ప్రతి‌ష్టా‌త్మక సిని‌మాకు దర్శ‌కత్వం వహిం‌చిన వేదాంతం రాఘ‌వయ్య తెలుగు వర్ష‌నుకు, యం.‌సి.‌శ్రీని‌వా‌సన్‌ (హాలీ‌వుడ్‌ శ్రీని‌వా‌సన్‌) తమిళ వర్ష‌నుకు నిర్దే‌శ‌కత్వం వహిం‌చారు.‌

సినిమా విశే‌షాలు..

ఆడ‌బ్రతుకు సినిమా రెండు కేంద్రాల్లో రజ‌తో‌త్సవం జరు‌పు‌కోగా పది కేంద్రాల్లో వంద‌రో‌జులు ఆడింది.‌ తమి‌ళంలో కూడా ఈ సినిమా సూపర్‌ హిట్టే! దేవిక (అసలు పేరు ప్రమీల)కు జెమినీ సంస్థలో నటిం‌చడం ఇదే ప్రథమం.‌ ఈ సిని‌మాలో అద్భు‌తంగా నటిం‌చిన దేవి‌కకు ఈ రెండు భాష‌ల్లోనే కాకుండా మల‌యా‌ళంలో కూడా మంచి అవ‌కా‌శాలు వెతు‌క్కుంటూ వచ్చాయి.‌ హిందీలో రాజ్‌కు‌మార్‌ ధరిం‌చిన పాత్రను కాంతా‌రావు ధరిం‌చారు.‌ ఇది ప్రేక్ష‌కుల సాను‌భూ‌తిని పొందే ఒక భగ్న ప్రేమి‌కుని ఉదా‌త్త‌మైన పాత్ర.‌ ఈ చిత్రని‌ర్మా‌ణా‌నికి ఐదు‌లక్షలు ఖర్చ‌యింది.‌ హిందీ ‌‘జిందగీ’‌ మాతృ‌కకు ఎక్కువ మార్పులు చేయ‌కుండా పాటలు, నృత్యా‌లతో సహా యథా‌త‌థంగా అను‌క‌రిస్తూ చిత్రాన్ని నిర్మిం‌చారు.‌ తమి‌ళంలో పాట‌లను కణ్న‌దా‌సన్‌ రాయగా తెలు‌గులో వాటిని ఆత్రేయ, సినారె రాశారు.‌ ఆత్రేయ ఆ సిని‌మాకు రాసిన పాటలు అల‌రిం‌చాయి.‌ కవి‌సా‌మ్రాట్‌ విశ్వ‌నాథ వారి సమక్షంలో సినిమా శత‌ది‌నో‌త్స‌వాన్ని విజ‌య‌వా‌డలో నిర్వ‌హిం‌చారు.‌ ‌‘ఆడ‌బ్రతుకు’‌ విడు‌ద‌ల‌యిన ఈ సంవ‌త్సరం ఎన్టీ‌ఆర్‌ నటిం‌చిన 12 సిని‌మాలు కూడా యాభై రోజు‌లకు పైగా ఆడగా, ఎని‌మిది చిత్రాలు శత‌ది‌నో‌త్సవం జరు‌పు‌కో‌వడం, ‌‘పాండవ వన‌వా‌సము’, ‌‘ఆడ‌బ్రతుకు’‌ చిత్రాలు రజ‌తో‌త్సవం జరు‌పు‌కో‌వడం విశేషం.‌ విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూ‌ర్తిలు కలిసి సంగీత దర్శ‌కత్వం నిర్వ‌హిం‌చిన ఆఖరి సిని‌మాగా కూడా ‌‘ఆడ‌బ్రతుకు’‌నే చెప్పు‌కో‌వాలి.
- ఆచారం షణ్ముఖాచారి

విజేత విక్రమ్ (1987)




పల్లవి:
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో
పొందులో ప్రేమ విందులో
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నుల్లో తొలివలపు కళలారాబోసింది జాణలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా

చరణం: 1
చామంతి నిగ్గు చంగావి సిగ్గు చెక్కిళ్ళ కురిసేటి వేళ
అరె ఈ వాలుపొద్దు ఓ పూల ముద్దు కౌగిల్లు కోసరేటి వేళ
గుండెలోన కొత్త కోరుకుంది చెప్పబోతే గొంతు దాటకుంది
గోదారి పొంగల్లె దూకేటి నీ ఈడు నా దారికొచ్చింది లేవమ్మో
నీ దారి నాదారి ఒకటైన వయసల్లే రావయ్యో..
అల్లుకో అల్లిబిల్లిగా మత్తుగా గమ్మత్తుగా

గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా

చరణం: 2
అందాల కొమ్మ అపరంజి బొమ్మ  తోడుంటే తీరేను తాపం
ఆ నీలి కళ్ళ వాకిళ్లలోన మెరిసేను ఆకాశ దీపం
తీరకుంది తీపి దాహమేదో ఆరకుంది వింత మోహమేదో
మొగ్గల్లే నువ్వొస్తే సిగ్గిల్లే సిరిమల్లె
సిగురాకు సొగసంత నాదమ్మో
ఈ పూల పందిళ్లు మురిపాల సందిళ్ళు నీకయ్యో
మెత్తగా పూల గుత్తిగా హత్తుకో కొత్త కొత్తగా

కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో 


చిత్రం: విజేత విక్రమ్  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల


భారతంలో అర్జునుడు (1987)



 నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివ్వాల అవ్వాల ఇవ్వాళ

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా

నీ సుతారమంత సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయ్యారి సొగసులు కాజేసి ముద్దులు
విరాలమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపు సొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబి రేకుల జిలేబి కైపుల  గులాము లవ్వాలిరా
నువ్వడిగితే తీసివ్వనా నీ ఒంటికె సెంటవ్వనా

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా

నీ మిఠాయి మాటల గిటారు పాటలు మిటారితో పాడుకో
నా పరాచికాలకు సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల మిషారి లోపల రసాలు అందించవే
నీ సూదంటు నడుముని నా కంటి చూపుల
దారాలలో దాచవే
నువ్వడిగితే నేనివ్వనా చెయ్ తగిలితే పువ్వవ్వనా

నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాల అవ్వాల ఇవ్వాళ
నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ


చిత్రం: భారతంలో అర్జునుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , జానకి

బ్లఫ్ మాస్టర్ (2018)





ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే

మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..

తెలియని భావాలన్నీ
తోడై నన్నే చేరీ
నాతో చేస్తున్న సావాసమా
అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని
ప్రేమ గీతాల ఆలాపనా..   
కురిసే వరమై ఎదనే తడిమెనుగా
కలిసే వరసై మనసే మురిసెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఎలా
ప్రేమే నాలో చేరిందెలా..

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే

కొత్తగ నాకే నేను
పరిచయమౌతున్నాను
నాలో ఈ మాయ నీదే సుమా
చిన్ని మోమాటాలే
చెప్పే మౌనంగానే
ప్రేమ బాగుంది నీ భావనా
పలికే పెదవే సడినే మరిచెనుగా
ఐనా మరిలా నీ పేరే పలికెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఇలా
ప్రేమే నాలో చేరిందెలా

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే
మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..


 చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: విశ్వనాథ్ కారసాల
గానం: సునీత
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
నిర్మాత: రమేష్ పి.పిళ్ళై
విడుదల తేది: 28.12.2018

********** ************ *********** ********** ***********
సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే....

ఎన్ని కన్నీళ్ల ఉసురుది
వెంటాడుతున్నది నీడల్లే కర్మ 
ధర్మమే నీ పాలి దండమై...
దండించ తప్పించుకోలేదు జన్మ...

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం

పాపం,పుణ్యం,
రెండింటికి నీదే పూచి
కన్ను తెరచి అడుగు వేయి ఆచి,తూచి...
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే....

ఏ కన్ను చూడదనా
నీ విచ్చల విడి మిడిసిపాటు...
ఏ చేయి ఆపదనా
తప్పటడుగుల నీ అలవాటు...
అదృశ్య సృష్టి గా సకల సృష్టి నిను  
గమనిస్తున్నది లెక్కగట్టి....

ఎంత బ్రతుకు
నీదెంత బ్రతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు...
ఇన్నాటలు, వేటలు
అవసరమా...!
మనుజా...మనుజా...
ఏమారితే నిను కబళిస్తుంది రా
మాయదారి పంజా... 
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ.....

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే...

చిత్రం:బ్లఫ్ మాస్టర్ 
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి,
గానం: అనురాగ్ కులకర్ణి,మోహన భరధ్వాజ,
సంగీతం: సునీల్ కశ్యప్.

తాయారమ్మ బంగారయ్య (1979)





పల్లవి:
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు
అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

చరణం: 1
ఒకడు ఆమ్ముకుపోయాడు... ఒకడు అడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు
మగవాడే...  మన పగవాడు
మగవాడే...  మన పగవాడు
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

NO... ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు
ప్రేమించాడు దేవత నీవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు
 ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు

చరణం: 2
నెత్తిన కూర్చుంది ఒకతి
నెత్తిన తన్నింది ఒకతి
ఒకతేమో శపథం చేసి యుద్ధం చేర్చింది
నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు

ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు

చరణం: 3
సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు
సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు
యుగయుగాల మీ బానిసే ఆడది
యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది


చిత్రం: తాయారమ్మ బంగారయ్య (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం:
గానం: జి. ఆనంద్, సుశీల


జాను (2020)




ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా

ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా


కదలని ఓ శిలనే అయినా

త్రుటిలో కరిగే కలవే అయినా

ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా

ఏదో ఒక బదులై  నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా


నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇపుడే నను కనగా
అనగనగా...  అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా

గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా

యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 

అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 

తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా 
రాకూడదు ఇంకెవరైనా 

అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలి

 చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్